Sakshi News home page

Upasana: చిరంజీవికి పద్మవిభూషణ్.. మా తాతయ్యకు మాత్రమే కాదు: ఉపాసన

Published Wed, Feb 7 2024 5:35 PM

Upasana Emotional Words About Her Grand Father Pratap Reddy Birthday - Sakshi

భారతీయ వైద్య రంగంలో విప్లవం తీసుకొచ్చిన ప్రముఖ వైద్యుడు, అపోలో ఆస్పత్రి అధినేత ప్రతాప్‌ సీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైద్య రంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ అవార్డులతో సత్కరించింది. అలాంటి ప్రతాప్‌ సీ రెడ్డి తన అపోలో ఆస్పత్రి సేవలను దేశంవ్యాప్తంగా విస్తరించిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 5వ తేదీన ఆయన 91వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చెన్నైలోని గ్రీమ్స్‌ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆయన మనవరాలు, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత నిమ్మి సాక్సో రాసిన అపోలో స్టోరీ అనే కామిక్‌ బుక్‌ను డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి ఆవిష్కరించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవికి ప‌ద్మ‌విభూష‌ణ్ రావ‌డం ప‌ట్ల ఎలా అనిపిస్తుంద‌ని ఉపాసనను ప్రశ్నించారు. దీనికి ఉపాస‌న చెప్పిన స‌మాధానం వైర‌ల్‌గా మారింది.

ఉపాసన మాట్లాడుతూ.. 'మా గ్రాండ్ ఫాద‌ర్‌ మాత్ర‌మే కాదు.. ఇప్పుడు క్లీంకార గ్రాండ్ ఫాద‌ర్‌ కూడా ప‌ద్మ విభూష‌ణ్ అందుకున్నారు. మా కుటుంబంలో ఇద్ద‌రు ఈ పుర‌స్కారం అందుకోవ‌డం నిజంగా ఎంతో గౌర‌వంగా భావిస్తున్నా.  మా తాత జన్మదినం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ రోజును భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలలు కనే యువ వ్యాపారవేత్తలు, మహిళలతో కలిసి జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. వైద్య రంగంలో ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడం, ఆయన కలలను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తామని' ఉపాసన పేర్కొన్నారు. కాగా..  సినీ రంగంలో చేసిన సేవ‌ల‌కు మెగాస్టార్ చిరంజీవిని ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం దేశ రెండో అత్యున్న‌త పుర‌స్కారం ప‌ద్మ‌విభూష‌ణ్‌తో స‌త్క‌రించింది. అంతకుముందు 2010లో ప్ర‌తాప్ చంద్ర రెడ్డి కూడా ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

What’s your opinion

Advertisement