కోలీవుడ్ స్టార్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. విజయ మాటతీరు, అతడి వ్యవహార శైలి కూడా ఈ పుకార్లకు ఆజ్యం పోస్తోంది. ఇటీవల తమిళనాడులో పదో తరగతి, ప్లస్ 1, ప్లస్ 2 తరగతుల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పనైయూరులోని కార్యాలయానికి ఆహ్వానించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించి సత్కరించాడు విజయ్. ఈ సందర్భంగా ఓటుకు నోటు విధానం మంచిది కాదని సూచించాడు.
తాజాగా మంగళవారం ఉదయం తన అభిమాన సంఘ నిర్వాహకులను, కార్యకర్తలను చైన్నెలోని తన కార్యాలయంలో కలిశాడు. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లోనూ జరుగుతున్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించినట్లు సమాచారం. అలాగే రాజకీయ పరిణామాల గురించి సైతం మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ భేటీ ముగిసిన తర్వాత విజయ్ తన కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ను లెక్కచేయకుండా వెళ్లిపోయాడు. రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ కారును అలాగే ముందుకు పోనివ్వడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.500 చలానా వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. 'ఏంటి హీరో ఇది.. మీరే ఇలా రూల్స్ బ్రేక్ చేస్తే మీ అభిమానులు ఏం పాటిస్తారు? ఇదేనా మీరు ఫ్యాన్స్కు ఇచ్చే సందేశం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.