ములుగు: మిచాంగ్ తుపాన్ కారణంగా వరుసగా రెండో రోజు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో చేతికి వచ్చిన వరి పంట, పత్తి చేన్లు తడిసిముద్దయ్యాయి. ఉదయం కొంత మేర తగ్గిన వర్షం మధ్యాహ్నం సమయానికి ఊపందుకుంది. రాత్రి వరకు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో చేతికి అందివచ్చిన పంట కళ్లముందే నీటిపాలుకావడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పూర్తి స్థాయిలో పీఏసీఎస్, ఐకేపీ, జీసీసీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రాలేదు. దీంతో వరి పంటను కోయించిన రైతులు తమ పంటను ఎవరికి అమ్ముకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. పంట తడిసి ముద్దవడం చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.
మిర్చి పంటకు తీవ్ర నష్టం
జిల్లాలో వరి తర్వాత గోదావరి పరీవాహక ప్రాంతా లైన ఏటూరునాగారం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం(కె) మండలాలతో పా టు ములుగు, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట మండలాల్లో అత్యధికంగా మిర్చి సాగు అవుతుంది. ప్రస్తుతానికి మిర్చి పంట కాత దశలో ఉంది. ఈ సమయంలో మిచాంగ్ తుపాన్ ప్రభావంతో కాత, పూత రాలి మొక్కలు నేలవాలాయి. ఒక్కో ఎకరానికి సుమారు రూ.60వేలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతన్నలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
వరి, పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం
ఎడతెరపి లేకుండా
కురుస్తున్న చిరు జల్లులు
వర్షపాతం వివరాలు..
మండలం వర్షపాతం(ఎం.ఎం)
ములుగు 37.6
వెంకటాపురం(ఎం) 71.2
గోవిందరావుపేట 62.2
ఎస్ఎస్ తాడ్వాయి 57.6
ఏటూరునాగారం 58.6
కన్నాయిగూడెం 55.6
మంగపేట 65.2
వెంకటాపురం(కె) 61.6
వాజేడు 43.8