సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం మందకొడిగా సాగి.. సాయంత్రానికి పుంజుకొని.. 80.41 శాతం ఓటింగ్ నమోదైంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు నాగర్కర్నూల్ 78.58 శాతం, అచ్చంపేట 79.97 శాతం, కొల్లాపూర్ 79.89 శాతం కాగా.. కల్వకుర్తిలో 83.23 శాతం కలిపి జిల్లాలో మొత్తం 80.41 శాతం పోలింగ్ నమోదైంది. కాగా గత ఎన్నికల పోలింగ్ 81.25 శాతంతో పోలిస్తే ఈసారి కాస్త తక్కువగా నమోదైంది. ఈసారి ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. సాయంత్రం 3 గంటల సమయానికి పురుషులు 57 శాతం ఓటేయగా.. సీ్త్రలు 60 శాతం వరకు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాత్రి 9 గంటల వరకు బ్యాలెట్ యూనిట్లు, ఈవీఎం మిషన్లను కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు.
సాయంత్రానికి పెరిగిన రద్దీ..
గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓటి ంగ్ మందకొడిగా సాగింది. ఈవీఎం మొరాయించిన చోట్ల ఓటర్లకు నిరీక్షణ తప్పలేదు. మిగతా చోట్ల పెద్దగా క్యూలైన్లు లేకుండానే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 13 శాతం లోపు మాత్రమే పోలింగ్ కాగా.. మ ధ్యాహ్నం ఒంటిగంట తర్వాత పుంజుకుంది. అనంతరం మళ్లీ 3 గంటల వరకు మందకొడిగా సాగింది. ఒకదశలో కొన్ని పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక బోసిపోయి కనిపించాయి. సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు మళ్లీ ఓటర్ల తాకిడి పెరిగింది.
లెక్కింపునకు ఏర్పాట్లు..
ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియను జిల్లాకేంద్రంలోని నెల్లికొండ వద్దనున్న వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించనున్నారు. అలాగే కల్వకుర్తి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియను రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలం మంగళ్పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్నారు.
ముగిసిన అసెంబ్లీ ఎన్నికల
ఓటింగ్ ప్రక్రియ
సాయంత్రం 4 గంటల తర్వాత ఓటర్ల రాక
గత ఎన్నికలతో పోల్చితేఈసారి కాస్త తగ్గిన శాతం
3న కౌంటింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు
ఈవీఎంల మొరాయింపు..
బల్మూరులోని పోలింగ్ కేంద్రం 167లో ఈవీఎం మొరాయించడంతో ఓటింగ్ నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా గంటల తరబడి పోలింగ్ కొనసాగింది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపనగండ్ల మండల కేంద్రంలో సాయంత్రం 5 తర్వాత సైతం పోలింగ్ కొనసాగింది. ఎన్మన్బెట్ల, ముక్కిడిగుండం, మొలచింతలపల్లి గ్రామాల్లో రాత్రి వరకు పోలింగ్ సాగింది. ఈవీఎంలు మొరాయించిన చోటకు సంబంధిత సెక్టార్ అధికారులు చేరుకుని ప్రత్యామ్నాయంగా మరో ఈవీఎం మిషన్ను ఏర్పాటు చేశారు. సు మారు గంట నిరీక్షణ తర్వాత మళ్లీ య థావిధిగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
జిల్లాకేంద్రంలోని 115 పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ ఉదయ్కుమార్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. నాగర్కర్నూల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంకట్రెడ్డి, అచ్చంపేట నియోజకవర్గ ఆర్ఓ గోపీరాం, కొల్లాపూర్ కుమార్ దీపక్, కల్వకుర్తి నియోజకవర్గ ఆర్ఓగా శ్రీను బాధ్యతలు నిర్వర్తించారు. సాధారణ పరిశీలకులు మిథిలేశ్ మిశ్రా, జిల్లా పోలీస్ అబ్జర్వర్ ఇలియాస్ ఎన్నికల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.