వర్షాభావ పరిస్థితులకు తోడు భానుడి భగభగలతో ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటాయి. నీటిమట్టాలు గణనీయంగా పడిపోగా.. బోర్లు, బావులు వట్టిపోయాయి. ప్రధానంగా చేతికొచ్చే దశలో వరి ఎండిపోతుండడంతో అన్నదాతలు నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల కిరాయి వెచ్చించి ట్యాంకర్లతో తడులు అందిస్తుండగా.. పలు ప్రాంతాల్లో వాగులు, చెరువుల నుంచి కిలోమీటర్ల కొద్దీ పైపులు వేసి నీరు పారిస్తున్నారు. కొందరు వ్యయప్రయాసలకోర్చి బోర్లు తవ్విస్తున్నా.. చుక్క నీరు పడని పరిస్థితి ఉంది. దీంతో చేసేదేమీ లేక సాగు చేసిన పంటను పశువులు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు పోను పంటలను కాపాడుకునేందుకు చేసిన అప్పులు పెనుభారంగా మారడంతో వారు విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల జల ఘోష.. ఆర్థిక ఇబ్బందులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..