రామగిరి(నల్లగొండ): కవిత్వానికి విద్యే మూలమని కవి, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య పేర్కొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సామాజిక కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన విద్యా విధానం వల్ల సమాజంలో అసమానతలు పెరిగి పేద వర్గాల వారు విద్యకు దూరమయ్యే పరిస్థితి వస్తోందన్నారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనంలో అనేక మంది కవులు సమాజంలో విద్య ప్రాధాన్యాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, కవులు బైరెడ్డి కృష్ణారెడ్డి, మేరెడ్డి యాదగిరిరెడ్డి, పురుషోత్తమాచార్యులు, చొల్లేటి ప్రభాకర్, సాగర్ల సత్తయ్య, గేర నరసింహ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రదాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పేరుమాళ్ళ వెంకటేశం, నర్రా శేఖర్రెడ్డి, పగిళ్ళ సైదులు, ప్రభాకర్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదారద్రీశుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెలుగు సంవత్సరం ఉగాది కావడంతో వేకువజామునే ఆలయాన్ని తెరచిన ఆచార్యులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు బిందే తీర్థం, ఆరాధన గావించారు. శ్రీస్వామి వారికి బాలభోగం చేపట్టిన తరువాత మూలవర్యులకు నిజాభిషేకం చేసి పట్టువస్త్రాలతో అలంకరించారు. శ్రీస్వామివారికి విశేషంగా సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు శ్రీస్వామి వారి దర్శనం భాగ్యం కల్పించారు. ఇక ఆలయంలో సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, నిత్య కల్యాణం, తిరువీధి జోడు సేవలను నిర్వహించారు. రాత్రి పవళింపు సేవను నిర్వహించి, ఆలయాన్ని మూసివేశారు.
యాదాద్రి పురోహితుడికి ఉగాది పురస్కారం
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణశర్మకు ఉగాది పురస్కారం లభించింది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చేతుల మీదుగా పరస్కారం అందుకున్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మినరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలో పంచాంగ శ్రవణం గావించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, అర్చకులు లక్ష్మణాచార్యులు, శ్రీనివాసాచార్యులు, పపద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.