వచ్చిన వాటిని స్కూళ్లకు పంపించాం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసే ఉత్తర్వులను ఈనెల 6వ తేదీనే విద్యాశాఖ జారీ చేసింది. దాని ప్రకారం వెంటనే నోట్ బుక్స్ సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వం పంపించిన నోట్బుక్స్ను పాఠశాలలకు పంపించాం. మిగితావి రాగానే విద్యార్థులకు అందించేలా చర్యలు చేపడతాం.
– భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నోట్బుక్స్ ఉచితంగా అందించాలని ఈసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, వాటిని విద్యార్థులకు అందించడంలో జాప్యం జరుగుతోంది. పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ఉమ్మడి జిల్లాలో 5 శాతం మంది విద్యార్థులకు కూడా నోట్బుక్స్ అందలేదు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు వర్క్ బుక్స్ ఇస్తామని చెప్పినా అవి కూడా ఇంతవరకు రాలేదు. ఇక, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నోట్బుక్స్ ఇస్తామని చెప్పగా, వాటిని కొనుగోలు చేసి సరఫరా చేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో విద్యార్థులందరికి నోట్ బుక్స్ లేకుండా పోయాయి. కొద్దిగా స్తోమత కలిగిన వారు నోట్బుక్స్ కొనుగోలు చేసుకుంటున్నారు. పేద విద్యార్థులకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు.
కావాల్సినవి.. వచ్చినవి!
● నల్లగొండ జిల్లాలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు 52,909 మంది ఉండగా వారందరికి వర్క్ బుక్స్ రావాల్సి ఉంది. ఇక, 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 40,632 మంది ఉన్నారు. వారికి 5,47,890 నోట్ బుక్స్ అవసరమని విద్యాశాఖ తేల్చింది. అందులో 200 పేజీల లాంగ్ నోట్ బుక్స్ (సింగిల్ రూల్) 86,295 రావాల్సి ఉండగా 6,300 వచ్చాయి. 200 పేజీల లాంగ్ నోట్బుక్ (ప్లెయిన్) 4,61,595 రావాల్సి ఉండగా 1,20,575 వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు జిల్లాకు 23.16 శాతం నోట్ బుక్స్ అందాయి.
● యాదాద్రి భువనగిరి జిల్లాలో 28,886 మంది విద్యార్థులకు 3,08,558 నోట్ బుక్స్ రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 95,100 నోట్ బుక్స్ వచ్చాయి. వాటన్నింటినీ పాఠశాలలకు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
● సూర్యాపేట జిల్లాలో 31,205 మంది విద్యార్థులకు 3,27,600 నోట్ బుక్స్ రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1.48 లక్షల నోట్ బుక్స్ వచ్చాయి. వాటిని పాఠశాలలకు పంపించామని అధికారులు పేర్కొంటున్నారు.
త్వరగా ఇవ్వాలని కోరుతున్న తల్లిదండ్రులు
పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వం నోట్ బుక్స్ త్వరగా పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈసారి ప్రభుత్వమే నోట్ బుక్స్ ఇస్తుందని టీచర్లు చెప్పడంతో చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు వాటిని కొనుగోలు చేయలేదు. దీంతో పాఠశాలల్లో ఉపాధ్యాయులు హోం వర్క్ ఇచ్చినా నోట్బుక్స్ లేక రాసుకోలేని పరిస్థితి నెలకొంది.
ఫ పాఠశాలలు ప్రారంభమై
15 రోజులైనా అందని కాపీలు
ఫ ప్రభుత్వం మొదటిసారిగా నిర్ణయం తీసుకున్నా సరఫరాలో జాప్యం
ఫ ఉమ్మడి జిల్లాకు కావాల్సినవి 11,84,048.. వచ్చినవి 3,69,975
ఫ నోట్ పుస్తకాలు లేకపోవడంతో
విద్యార్థుల ఇబ్బందులు
తరగతి వారీగా విద్యార్థులు..
తరగతి నల్లగొండ యాదాద్రి సూర్యాపేట
6 7,614 5,420 6,143
7 9,188 6,129 6,379
8 7,973 5,757 6,684
9 8,072 5,968 6,080
10 7,785 5,612 5,920
మొత్తం 40,632 28,886 31,205