ఇంటర్ కాలేజీ క్రీడల్లో ఎన్జీ విద్యార్థులకు పతకాలు
Published
Wed, Nov 15 2023 1:34 AM
రామగిరి(నల్లగొండ): హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం జరిగిన ఎంజీయూ పరిధిలోని ఇంటర్ కాలేజీ బాక్సింగ్, జూడో పోటీల్లో నల్లగొండకు చెందిన ఎన్జీ కళాశాల విద్యార్థులు పలు పతకాలు సాధించారని కళాశాల పీడీ కడారి మల్లేష్ మంగళవారం తెలిపారు. పురుషుల బాక్సింగ్ విభాగంలో 11 బంగారు పతకాలు, రెండు సిల్వర్, మహిళా విభాగంలో మూడు బంగారు, ఒక కాంస్య పతకం సాధించారని పేర్కొన్నారు. జూడో పురుషుల పోటీలో ఒక బంగారు, ఒక సిల్వర్ పతకాలు గెలుపొందారని తెలిపారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు త్వరలో జరిగే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
కొండమల్లేపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. కొండమల్లేపల్లి మండలంలోని చిన్న అడిశర్లపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యంలో తాలు లేకుండా చూసుకోవాలన్నారు. తేమ తక్కువ వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటా పెట్టి మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రూ.250కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఆయన వెంట సివిల్ సప్లయ్ మేనేజర్ రాజేందర్, డీటీసీఎస్ శ్రీనివాస్గౌడ్, సీఈఓ తిరుపతిరెడ్డి, పాపిరెడ్డి తదితరులు ఉన్నారు.
రేపు హుజూర్నగర్కు కోదండరాం రాక
హుజూర్నగర్: హుజూర్నగర్లో ఈనెల 16న తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సుప్రీంకోర్టు అడ్వకేట్ నిరూప్రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ దామోదర్రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి హాజరవుతున్నట్లు టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. సీఎం కేసీఆర్ పాలన, తెలంగాణ పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
నాగార్జున కళాశాలలో పుస్తక ప్రదర్శన
రామగిరి(నల్లగొండ): నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ (ఎన్జీ) కళాశాలలో లైబ్రరీ విభాగం ఆధ్వర్యంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్ తెలిపారు. ఎంవి.గోనారెడ్డి లైబ్రరీకి పుస్తకాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మునీర్, డాక్టర్ ఏ.దుర్గాప్రసాద్, డాక్టర్ యాదగిరి, డాక్టర్ కృష్ణకౌండిన్య, లవీందర్రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్గౌడ్, డాక్టర్ నాగుల వేణు పాల్గొన్నారు.
పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే వేటు తప్పదు
హుజూర్నగర్: పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే వేటు తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్నగర్లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటూ, పార్టీకి నష్టం చేస్తున్న జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రవి నాయక్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎన్.పాండు, ఎన్.వెంకటేశ్వర్లు, కె.గోపి, పల్లె వెంకటరెడ్డి, డి.బ్రహ్మం, వి.సైదులు, పాండు, యాకోబు, హుస్సేన్, రాంబాబు, శీలం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.