తిరుమలగిరి (తుంగతుర్తి) : దేశంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే రాజకీయ పార్టీల గుర్తుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు కాడెడ్లు. ఈ గుర్తుతోనే దేశమంతా ఎన్నికల బరిలో నిలిచింది. ఆ తరువాత ఆ పార్టీ చీలి కాంగ్రెస్ (ఇందిర) ఏర్పాటు కావడంతో దీనికి ఆవు దూడ గుర్తును కేటాయించారు. ఇదే గుర్తుతో 1971 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తరువాత చీలిపోయిన కాంగ్రెస్ తిరిగి విలీనమై భారత జాతీయ కాంగ్రెస్ పేరుతో ఏర్పడడంతో దీనికి హస్తం గుర్తును కేటాయించారు. 1977 నుంచి హస్తం గుర్తుతో కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలుస్తోంది.
పీడీఎఫ్కు మొదట హస్తం..
1952 సార్వత్రిక ఎన్నికల సమయంలో కమ్యూనిస్టు పార్టీపై నిర్బంధం ఉండటంతో పీడీఎఫ్ పేరుతో బరిలో నిలువగా వీరికి స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించే హస్తం గుర్తును కేటాయించారు. ఆ తరువాత సీపీఐకి కంకి కొడవలి, సీపీఎంకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తులను కేటాయించడంతో ఇవే గుర్తులతో ఆయా పార్టీలు ప్రతి సారి ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి.