మాడుగులపల్లి: కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాముతో సమానమని.. రాష్ట్రంలో ఇకపై ఆ పార్టీది దింపుడు కల్లం ఆశేనని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మండలంలోని పాములపాడు గ్రామంలో బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావుకు మద్దతుగా ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు పదవులపై వ్యామోహం తప్ప ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో 30 మందికిపైగా ముఖ్యమంత్రి అభ్యర్థులేనని, గడ్డాలు పెంచిన వారంతా సీఎంలు కాలేరని ఎద్దేవా చేశారు. ఉదయం ఓ పార్టీలో సాయంత్రం మరో పార్టీలో ఉండే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఆయన సోదరుడు వంతపాడడం సిగ్గు చేటన్నారు. హుజూర్నగర్, కోదాడలో ఉత్తమ్ దంపతులు ఓడిపోవడం ఖాయమన్నారు. అనంతరం భాస్కర్రావు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం చిరుమర్తి, ఆగామోత్కూర్, గురప్పగూడెం, పోరెడ్డిగూడెం బొమ్మకల్లు గ్రామాల్లో భాస్కర్రావు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, ఆయా గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షడు బాబయ్య, వేములపల్లి పీఏసీఎస్ చైర్మన్ రాములుగౌడ్ పాల్గొన్నారు.