నల్లగొండ టూటౌన్: నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే అన్నారు. మంగళవారం ఆమె నల్లగొండ పట్టణం 11వ వార్డు పరిధిలోని వివిధ కాలనీల్లో బీజేపీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్గౌడ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్ సర్కార్ను ఇంటికి సాగనంపాలని, అధికార మదంతో మాట్లాడుతున్న కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా పాతర వేసి తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, ధరణి వంటి వాటితో వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీ ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తుందన్నారు. రైతులకు ధాన్యం మద్దతు ధర రూ.3100 ఇస్తామని, విద్యార్థినులకు ల్యాప్టాప్లు ఇస్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామని, కేంద్రం ఇస్తున్న ఇళ్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఇవ్వలేదని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, పోతెపాక సాంబయ్య, కంకణాల నాగిరెడ్డి, కంకణాల లక్ష్మమ్మ, డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, బొజ్జ నాగరాజు, దాసరి సాయి, పెరిక మునికుమార్, ఏరుకొండ హరి, దినేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే