చండూరు: ముప్పై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ చేయకుండా కాంగ్రెస్ మోసం చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను అణచివేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మునుగోడు అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ చండూరులో ఏర్పాటు చేసిన మాదిగల సమరభేరి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సహకరిస్తామని దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇవ్వడం వల్లే ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు మాదిగలకు వివరించారు. నేను ఏదిచేసినా మాదిగల అభ్యున్నతి కోసమేనని.. నన్ను నమ్మి బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చా రు. నా జాతి అభివృద్ధి కోసమే ఏ పార్టీలో చేరడం లేదని, ఎస్సీ వర్గీకరణ సాధించి నా జాతి బిడ్డలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ప్రాణాపాయ స్థితి లో ఉన్నప్పుడు నిమ్మరసం ఇచ్చి ప్రాణం కాపాడితే దానికి ఫలితంగా నన్ను రెండుసార్లు జైల్లో పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితున్నీ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదని, మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించినందుకు కేసీఆర్ నన్ను జైల్లో పెట్టారన్నారు.
మాదిగలంతా బీజేపీని ఆదరించండి
మాదిగల చిరకాల వాంఛ అయిన ఎస్సీ వర్గీకరణ చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనందున మాదిగలంతా బీజేపీని ఆదరించి తనకు ఓటెయ్యాలని ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి కోరారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి, దూడల భిక్షం, ఎమ్మార్పీ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం, మండల అధ్యక్షుడు ఇరిగి దుర్గాప్రసాద్, దర్శనం వేణు, చిలుక జయరాం, గోపినాథ్, చరణ్ పాల్గొన్నారు.