ఫ నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి
ఫ రైతులకు అవగాహన కల్పిస్తున్న
వ్యవసాయ అధికారులు
పెన్పహాడ్ : యాసంగిలో ఆరుతడి పంటలైన శనగ, మొక్కజొన్న, జొన్న పంటలతగో పాటు వివిధ రకాల కూరగాయాలు సాగు ఎంతో మేలని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. యాసంగిలో ఆరుతడి పంటలపై నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని సూచిస్తున్నారు. రైతులు పొలాల వద్ద ఇంకుడుగుంత నిర్మించుకుంటే అందులో వర్షపు నీరు చేరి నిల్వ ఉంటుందని చెబుతున్నారు.
నీటి తడులు అందించాలి
పంటలకు కీలకమైన పూతదశలో పంట నీటిఎద్దడికి గురైతే 50శాతం కన్నా తక్కువ దిగుబడి వస్తుంది. నీటితడులు లేక దిగుబడి గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పంటలకు గింజకాయ కట్టే దశలో నీటిని అందించాలి. జొన్న పంటలకు సాధారణంగా 400–660మి.మీ అవసరం ఉంటుంది. మొక్కజొన్నకు 400–550 మి.మీ నీరు వేరుశనగతో పాటు ఇతర పంటలకు 300–400 మి. మీ నీరు అవసరం. ఇందులో మొక్కలు నాటిన 15–18రోజుల్లో నీటి తడులు అందించాలి. పంట తీసే సమయంలో కంటే 15 నుంచి 28 రోజుల్లోపు చివరి తడి అందించాలి. నీటి పారకంలో ద్వారా కాకుండా మొక్కల మొదట్లో నీరందిస్తే వేర్లకు త్వరగా చేరుతుంది. యాసంగిలో సాగుచేసే వరి పంటకు నాటు వేసినప్పుడు నుంచి పొట్టదశకు చేరే వరకు నీరు అవసరం ఉంటుంది. రైతులు మూస ధోరణి కాకుండా ఆధునిక పద్ధతిలో పంటలు సాగు చేయాలి. దీంతో అధిక దిగుబడులు పొందుతారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి. నీటి వినియోగాన్ని బట్టి పొదుపుగా వాడితే అధిక దిగుబడి సాధించవచ్చని వారికి వివరిస్తున్నారు.
వేరుశనగ పంటతో లాభాలు
ప్రతి యాసంగి పంటలో 2.30ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తా. వేరుశనగ పంటతో అధిక లాభాలు సాధించవచ్చు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు అందిస్తారు.
– నలబోలు వెంకట్రెడ్డి,
రైతు, గాజులమల్కాపురం
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు పండిస్తే రైతుల కు మంచి లాభం చేకూరుతుంది. ఆరుతడి పంటలతో పాటు కూరగాయాల సాగు ద్వారా అధిక దిగుబడి సాధించాలి.
– కృష్ణసందీప్, ఏఓ, పెన్పహాడ్