మిర్యాలగూడ : లెవీ బియ్యాన్ని వెంటవెంటనే అప్పగించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత యాసంగి, వానాకాలానికి సంబంధించిన 32,770 టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయాలన్నారు. లెవీ అప్పగించే విషయంలో మిల్లర్లు అలసత్వం వహించవద్దని సూచించారు. అంతకుముందు మాడ్గులపల్లి మండలంలోని బొమ్మకల్, వేములపల్లి మండలంలోని సల్కునూరు, ఆమనగల్లు ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. ఇటీవల వర్షానికి ధాన్యం ఎక్కడా తడవలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ డీఎం నాగేశ్వర్రావు, ఆర్డీఓ చెన్నయ్య, సివిల్ సప్లయ్ డీటీ జావేద్, ఆర్ఐ సురేందర్సింగ్, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణచౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్