తెగుళ్ల నివారణతోనే ‘మిరప’కు రక్షణ | Sakshi
Sakshi News home page

తెగుళ్ల నివారణతోనే ‘మిరప’కు రక్షణ

Published Thu, Dec 14 2023 2:16 AM

పెద్దవూరలో సాగవుతున్న మిరప  - Sakshi

కాయ తొలిచే పురుగు..

కాయ తొలిచే పురుగు కాయలను రంధ్రం చేసి లోపలి భాగాన్ని తినడం వలన కాయ రాలిపోవడం లేదా కాయ పరిమాణం తగ్గి నాణ్యత, దిగుబడి కోల్పోతుంది.

నివారణ చర్యలు

లీటర్‌ నీటిలో 1.5 గ్రా. అసిఫేట్‌, లేదా ఒక మి.లీ. నుపులురాన్‌, లేదా 0.3 మి.లీ. రైనాక్సీఫైర్‌ లేదా 0.3 గ్రాముల ప్లూబెండమైడ్‌ను కలిపి పిచికారీ చేయాలి.

పెద్దవూర: మిరప పంటలో సస్యరక్షణ పద్ధతులు పాటించి కాపాడుకోవాలని ఉద్యానవన క్లస్టర్‌ అధికారి మురళి రైతులకు సూచించారు. పత్తి పంటలో పూర్తిగా దిగుబడి తగ్గడం, పెట్టుబడులు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఈ ఏడాది జిల్లాలో అధిక విస్తీర్ణంలో మిరప పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట పక్వ దశలో ఉంది. అనేక చీడపీడలు వ్యాపించి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. శిలీంద్రాలు, పురుగులు, సూక్ష్మధాతువు లోపాలు ఉన్నట్లు దీనికి తోడు నల్ల తామర పురుగులు వ్యాప్తి ఉంది. కొమ్మ ఎండు, కాయకుళ్లు, బూడిద తెగుళ్లు, కాయతొలిచే పురుగుల వలన పంట నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో నాణ్యత తగ్గి తాలు కాయలు ఏర్పడి మార్కెట్‌లో ఆశించిన మద్దతు ధర లభించదు. తగిన నివారణ చర్యలు చేపడితే రైతులు పంట దిగుబడి పెంచుకోవచ్చునని సూచిస్తున్నారు.

కొమ్మ ఎండు–కాయ కుళ్లు తెగులు..

మిరప పైరు పూత దశ నుంచి కాయ దశకు వచ్చే సమయాల్లో కొమ్మ ఎండు తెగులు, కాయ కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. వీటి కారణంగా కొమ్మ, కాయ మీద బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. వీటి ప్రభావంతో కామ్మలు పైనుంచి కింది వరకు ఎండిపోతాయి. కాయ మీద మచ్చలు చిందరవందరగా ఏర్పడతాయి. వీటితో శిలీంద్ర ఉత్పత్తి కణాలు ఉండటంతో కాయ సహజ రంగును కోల్పోతుంది.

నివారణ చర్యలు

వీటి నివారణకు ఎకరం పొలానికి 200 లీటర్ల నీటిలో 200 మి.లీ. ప్రొఫికానజోల్‌, లేదా 100 మి.లీ. డైఫెన్‌ కొనజోల్‌, లేదా 200 గ్రాముల ఫైరాక్సీ స్ట్రోబిన్‌ను కలిపి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు..

చలి, తేమ వంటి వాతావరణ మార్పులతో బూడిద తెగులు సోకుతుంది. ఈ తెగులును కలుగజేసే శిలీంధ్రం వలన ఆకు కింది భాగంలో బూడిద రంగులో తెల్లటి పొడి ఏర్పడుతుంది. దీని వలన ఆకు ఆకుపచ్చ రంగును కోల్పోయి పసుపు రంగులోకి మారి రాలిపోతుంది.

నివారణ చర్యలు..

ఎకరాకు 200 లీటర్ల నీటిలో 300 గ్రాముల గంధకం, లేదా 200 మి.లీ. డైనోకాప్‌, లేదా బెలటాన్‌, లేదా అజాక్సీస్ట్రోబిన్‌లను కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటర్‌ నీటిలో 200 మి.లీ. ట్రైడిమార్ఫ్‌ కలిపి పిచికారీ చేయవచ్చు.

జింకు లోపం..

భాస్వరం ఎక్కువగా వాడితే జింకు లోపం కనిపిస్తుంది. ఆకుల కనుపుల మధ్య పసుపుపచ్చ రంగులోకి మారి రాలిపోతుంది.

నివారణ చర్యలు..

జింకులోపం నివారణకు లీటర్‌ నీటిలో 2 గ్రాముల చీలేటెడ్‌ జింక్‌ను కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.

పక్షి కన్ను మచ్చ తెగులు..

తేమతో కూడిన చల్లటి వాతావరణంలో మిరప ఆకులపై సర్కోస్పోరా, ఆల్టర్‌నేరియా మచ్చలు ఆశిస్తాయి. సర్కోస్పోరా ఆశించినట్లయితే పక్షికన్ను ఆకారం గల మచ్చలు ఏర్పడుతాయి. ఈ ప్రభావంతో పంటలో నాణ్యత, రంగు తగ్గుతాయి.

నివారణ చర్యలు..

200 లీటర్ల నీటిలో 200 మి.లీ. ప్రొపికోనజోల్‌ను కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేసుకోవాలి. లేదా 100మి.లీ. డైఫెన్‌కొనజోల్‌ను కలిపి పిచికారీ చేయాలి.

1/1

Advertisement
Advertisement