నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలు ఈ నెల 27వ తేదీలోగా సమర్పించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ వ్యయ పర్యవేక్షణ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల నిర్వహణలో భాగంగా పోటీ చేసిన అభ్యర్థులు రోజూ నిర్వహించిన అకౌంట్స్ రిజిస్టర్లు, క్యాష్ రిజిస్టర్లు, బ్యాంక్ రిజిస్టర్లు, సమగ్ర వివరాలను నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ సి–13 రిపోర్ట్స్, అనెక్సర్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రొఫార్మాలు నింపే విధానాన్ని రిటర్నింగ్ అధికారులు, సహాయ వ్యయ పర్యవేక్షణ అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఎన్కోర్ ద్వారా సంబంధిత డాటాను నమోదు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి ఆర్.కిరణ్ కుమార్, రిటర్నింగ్ అధికారులు రవి, చెన్నయ్య, శ్రీరాములు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.