నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం నల్లగొండకు రానున్నారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన నల్లగొండకు వస్తున్నందున భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. మర్రిగూడ బైపాస్ వద్ద మంత్రికి స్వాగతం పలికి అక్కడి నుంచి ర్యాలీగా పట్టణంలోకి రానున్నారు. ర్యాలీ అనంతరం ఆయన మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, ప్రజలను కలవనున్నారు. కోమటిరెడ్డి మంత్రి పదవి చేపట్టి వారం రోజులు అవుతోంది. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఆయన గొంతులో ఇన్ఫెక్షన్ రావడంతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మొదటిసారిగా నల్లగొండకు వస్తున్నారు. పట్టణంలో ర్యాలీకి సంబంధించి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్లీడర్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ర్యాలీకి నల్లగొండ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రానున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
మధ్యాహ్నం
కలెక్టరేట్లో సమీక్ష..
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధితో పాటు పథకాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, విద్యుత్ సరఫరా , ప్రజలకు అవసరమైన తాగునీటి పథకాలపై సమీక్షించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకోన్నట్లు తెలుస్తోంది. అధికారులతో మాట్లాడి మిల్లర్లకు ధాన్యం ఇచ్చే విషయంలో వారి నుంచి గ్యారంటీ తీసుకునే విషయంపై అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్ ఇస్తున్నారు.. గతంలో ఎన్ని గంటలు ఇచ్చారు.. తదితర అంశాలపై సమీక్షించి అధికారుల నుంచి నివేదిక తీసుకునే అవకాశం ఉంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు ఇస్తున్నామని గత ప్రభుత్వం చెప్పింది. అయితే చాలా గ్రామాలకు ఇంకా అవి అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ తాగునీటి విషయంపై పూర్తి స్థాయిలో అదికారులతో మంత్రి చర్చించనున్నారని తెలిసింది.
ఫ స్వాగత ఏర్పాట్లు చేస్తున్న
కాంగ్రెస్ శ్రేణులు
ఫ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహణకు సన్నాహాలు
ఫ పలు శాఖలపై సమీక్షించనున్న
మంత్రి వెంకట్రెడ్డి