శ్రీశైలంటెంపుల్: భక్తుల సౌకర్యార్థం శ్రీశైలంలో తయారవుతున్న గో ఆధారిత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తోంది. శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలలోని గో మయం నుంచి పూజ సామగ్రి తయారీ చేసి భక్తులకు విక్రయిస్తున్నారు. వైదిక సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన గోశాల దినదినాభివృద్ధి చెందుతోంది. మొదట మూడు ఎకరాల విస్తీర్ణంలో 10 షెడ్లతో ప్రారంభమైన గోశాల ప్రస్తుతం 8 ఎకరాల్లో 15 షెడ్లతో 1,000కి పైగా గోవులకు ఆశ్రయం కల్పిస్తోంది. గోమయం నుంచి విభూది, హోమ పిడకలు, ధూప్స్టిక్స్ (ధూపపు బత్తీలు), గోఅర్క్ మొదలైన గో ఉత్పత్తులను దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి తయారీకి 15 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేవస్థానం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి వీటిని విక్రయిస్తోంది. గోఅర్క్ (250ఎం.ఎల్) రూ.100, దివ్యపరిమళ విభూది 100 గ్రాములు రూ.40, ధూప్స్టిక్స్ రూ.40 (పెద్దది), దంతమంజన్ పౌడర్ (80 గ్రాములు) రూ.50, హోమ పిడకలు ప్యాకెట్ (30 పిడకలు) రూ.60.. మేర విక్రయిస్తున్నారు. నెలకు గో పంచకం (గో అర్క్) 500 కేజీలు, ధూప్స్టిక్స్ 4 వేలు, హోమపిడకలు 15 వేలు, మొబైల్ యాంటీ రేడియేషన్ స్టిక్కర్లు 100, విభూది 2వేల కేజీలు ఉత్పత్తి చేస్తారు. గోఉత్పత్తుల ద్వారా దేవస్థానానికి నెలకు రూ.1,49,260, విభూది ద్వారా రూ.11,81,740 ఆదాయం వస్తోంది. ఈ మేరకు ఏటా దాదాపు రూ.1.50 కోట్లు దేవస్థానానికి సమకూరుతోంది.
గోవులు తెల్లన.. విభూది నల్లన
గోమయం (ఆవు పేడ) బాగా ఎండిన తర్వాత కాల్చగా వచ్చిన బూడిదను వివిధ స్థాయిలో జల్లెడ పడతారు. అనంతరం తిరిగి ఎండబెట్టి విభూది తయారు చేస్తారు. విభూదిధారణ వలన సమస్త సంపదలు చేకూరుతాయని, పాపాలను భస్మం చేసి, అరిష్టాలన్నింటిని తొలగించి సకల శుభాలను కలిగిస్తుందని చెప్పబడుతుంది. ఆలయసంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం విభూదిని తయారు చేస్తోంది.
ధూప్స్టిక్స్..
గోమూత్రం, పసుపు, కొన్ని రకాల మూలికలను (ఫ్రీ మిక్సింగ్ ఫౌడర్) కలిపి తయారు చేసే ధూప్స్టిక్స్ను భక్తులు అధికంగా కొనుగోలు చేస్తున్నారు.
మొబైల్ యాంటి రేడియేషన్ స్టిక్కర్లు..
గోమయమునకు కొన్ని రకాల పౌడర్లను కలిపి క్యాన్వాస్ వస్త్రంపై ఆరబెట్టడం ద్వారా మొబైల్ యాంటి రేడియేషన్ స్టిక్కర్లు తయారు చేస్తారు. గోమయం నేల మీద పడకుండా సేకరించి వాటికి తులసి పౌడర్, మర్రి వేర్లు చూర్ణంగా కలిపి వీటిని తయారు చేస్తున్నారు. మొబైల్ రేడియేషన్ తగ్గించుకునేందుకు ఈ స్టిక్కర్లను భక్తులు వినియోగిస్తున్నారు.
దంత మంజన్ పొడి..
ఆవు పిడకలను బాగా కాల్చి వివిధ దశల్లో ఆరబెట్టి మెత్తటి పొడిని సేకరిస్తారు. ఈ మెత్తటి పొడికి కొన్ని ద్రవ్యాలను కల్పడం వలన దంత మంజన్ పళ్ల్ల పొడి తయారవుతుంది.
గో పంచకం..
దేవస్థానం గోశాలలో గో పంచకం (గో అర్క్)ను తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచింది. గో మూత్రాన్ని సేకరించి మరగబెట్టి, ఆ ఆవిరిని చల్లార్చడం వలన గో అర్క్ తయారవుతోంది. శాసీ్త్రయ పద్ధతిలో తయారు చేసే గో అర్క్కు భక్తుల నుంచి ఎంతో ఆదరణ ఉంది. గోఅర్క్ను సేవించడం వలన శరీరంలో అధిక కొలస్ట్రాల్ తగ్గుతుందని, అలాగే నడుము, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని వీటిని కొనుగోలు చేస్తున్నారు. దేవస్థానం నెలకు 500 కేజీల గో ఆర్క్ను తయారీ చేసి విక్రయిస్తోంది.
శ్రీశైలంలో గో ఆధారిత ఉత్పత్తులకు
ఆదరణ
విభూది, గో అర్క్, ధూప్ స్టిక్స్,
దంత మంజన్ పళ్ల్ల పొడి తయారీ
తయారీలో శాసీ్త్రయ ప్రమాణాలు
పాటిస్తున్న వైనం
దేవస్థానానికి ఏటా
రూ.1.50 కోట్ల ఆదాయం
1/2
గోమయంతో తయారు చేసిన పిడకలను ఆరబెడుతున్న దృశ్యం
2/2
శాసీ్త్రయ ప్రమాణాలతో
విభూతి తయారు చేస్తున్న సిబ్బంది