టీడీపీ డోన్ నియోజకవర్గ ఇన్చార్జ్ ధర్మారం సుబ్బారెడ్డి బూటకపు హామీలను నమ్మి మోసపోవద్దని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల పట్టణాల్లో టీడీపీ స్మగ్లింగ్ బ్యాచ్ కొత్త ప్రచారానికి తెరతీసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో డోన్లో టీడీపీ గెలిస్తే ప్రతి రేషన్కార్డుదారుడికి 1.5 సెంట్ స్థలం ఇస్తామని డమ్మీ బాండ్లు పంపిణీ చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ప్యా పిలి పట్టణంలోనే 7,000 రేషన్ కార్డులు ఉన్నాయ ని కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని ఎకరాలు చంద్రబాబు నాయుడు ఇస్తారా? సుబ్బారెడ్డి ఇస్తారా అనేది ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు.
● అభివృద్ధిని చూసి ఓర్వలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న టీడీపీ నాయకులపై ప్రజలే చీపురు పట్టుకుని తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. డోన్, ప్యాపిలి మండలాల్లో నిరుపయోగంగా ఉన్న నంద్యాల నీటి పథకానికి రూ.10 కోట్లు వెచ్చించి ఉపయోగంలోకి తెచ్చి 17 గ్రామాల దాహార్తిని తీర్చామన్నారు. రూ.350 కోట్లతో చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకం ద్వారా మరో మూడు నెలల్లో నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా తాము వేసిన రోడ్లు తమలపాకు రోడ్లో, తారు రోడ్లో ప్రజలకు తెలుసన్నారు. ఆయన వెంట వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బొర్రా మల్లికార్జునరెడ్డి, డోన్ మార్కెట్యార్డ చైర్మన్ రాజా నారాయణమూర్తి, ఏపీఐసీసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.