కర్నూలు(సెంట్రల్): పారదర్శక ఓటింగ్ కోసమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మాక్ పోలింగ్ ప్రక్రియను చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఈవీఎం గోదాములో జరుగుతున్న మాక్ పోల్ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాక్ పోలింగ్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పక పాల్గొనాలన్నారు. వారే స్వయంగా ఓట్లు వేసి ఈవీఎంల పనితీరును పరిశీలించాలన్నారు. తాము వేసిన అభ్యర్థికే ఓటు పడుతుందో లేదో చూసుకోవాలని, చివరలో కౌంటింగ్ చేస్తే ఫలితం సక్రమంగా వస్తుందో లేదో చూసుకోవాలన్నారు. ఈ ప్రక్రియను సీసీ కెమెరాల నిఘాలో చేపట్టినట్లు చెప్పారు. ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు ఇచ్చిన వారు తప్పా ఇతరులకు అనుమతి ఉండబోదన్నారు.
మాక్ పోల్లో పాల్గొన్న
మేయర్ బీవై రామయ్య
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాక్ పోల్లో స్వయంగా పాల్గొని పరిశీలించారు. ఆయన వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా మాక్పోల్ పాల్గొని ఈవీఎంల పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఈవీఎంల ఎఫ్ఎల్సీ నోడల్ అధికారి, డీపీఓ నాగరాజునాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి పాల్గొన్నారు.
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి
డాక్టర్ జి.సృజన