No Headline
పరిష్కారమెప్పటికో ?
వానలొస్తే ప్రాణాలు పోకుండా ఉండేందుకు అప్పటి నుంచీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నా శాశ్వత పరిష్కారం ఇంకా లభించలేదు. గత ప్రభుత్వాల కాలంలో ప్రారంభమైన పనుల్లో మార్పులు జరిగాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020, 2021లలో కురిసిన వర్షాలతో శాశ్వత పరిష్కార దిశగా కాలనీలు నీట మునగకుండా ఉండేందుకు నాలాల ఆధునీకరణ, తదితర పనుల కోసం వ్యూహాత్మక నాలా నిర్మాణం పథకం( ఎస్ఎన్డీపీ ) చేపట్టింది. తొలిదశలో భాగంగా నగరం, శివార్లలోని పురపాలికల్లో మొత్తం 58 పనులకు శ్రీకారం చుట్టారు. వీటి అంచనా వ్యయం రూ.985.45 కోట్లు. వాటిల్లో 37 పనులు మాత్రం పూర్తయ్యాయి. రూ.581.29 కోట్లు ఇందుకు ఖర్చయ్యాయి. మిగతావి పూర్తి కాలేదు.
● శివార్లలోని పురపాలికల్లో 21 పనులకుగాను 8 పనులు మాత్రం పూర్తయ్యాయి. వీటికి రూ.6.89 కోట్లు ఖర్చు చేశారు.
● జీహెచ్ఎంసీ పరిధిలోని పనులకు అవసరమైన రూ.747.45 కోట్లకుగాను ఎస్బీఐ నుంచి 515.96 కోట్లు రుణంగా తీసుకున్నా రు. మిగతావి జీహెచ్ఎంసీ సమకూర్చింది.
● శివారు పురపాలికలు తమ వాటాగా చెల్లించాల్సిన మొత్తంలో ఇంకా రూ.115.66 కోట్లు చెల్లించాల్సి ఉండగా, చేతులెత్తేశాయి. జీహెచ్ఎంసీయే భరించాల్సిందిగా కోరాయి. కానీ జీహెచ్ఎంసీ ఈ నిధుల్ని సమకూర్చే పరిస్థితి లేదు.
● వరద ముంపునకు ప్రధాన కారణం నాలాలు, నాలాల్లోంచి వరదనీరు సాఫీగా వెళ్లే మార్గం లేక కాలనీలు, బస్తీలు మునుగుతున్నాయి. నాలాలకు తగిన రక్షణచర్యలు లేక వాటిల్లో పడి మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
నాలా ‘సేఫ్టీ’ ఏదీ ?
నాలాల వెంబడి ఎక్కడా ప్రమాదకర పరిస్థితులుండకుండా ఉండేందుకు థర్డ్పార్టీ ఏజెన్సీలతో వేసవికి ముందే గత రెండేళ్లుగా నాలా సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తున్నారు. నాలాలకు ఎక్కడైనా పైకప్పులు లేకున్నా, పెద్ద నాలాలకు జాలీలు లేకున్నా, రిటైనింగ్ వాల్స్ లేకున్నా, దెబ్బతిన్నా , నాలాలో ఎక్కడైనా మనుషులు పడేందుకు వీలున్నా గుర్తించి తగిన చర్యల కోసం ఈ సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తున్నారు. నివేదిక అనంతరం సంబంధిత ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడా ప్రమాదకర పరిస్థితి లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నాలా ఉందని తెలిసేలా హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాలి. సేఫ్టీ ఆడిట్ కోసం లక్షలాది రూపాయలు, పనుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రమాదాలు ఆగడం లేదు. తాజాగా, బేగంపేట నాలాలో ఇద్దరు మరణించారు. రైలు పట్టాలు దాటే క్రమంలో వారు పట్టాల కింద ఉన్న నాలాలోకి ప్రమాదవశాత్తు పడి ఉంటారని భావిస్తున్నారు. నాలాలు ఓపెన్గా ఉండకుండా, చెత్త కూడా వేయకుండా కూడా పటిష్టమైన చర్యలు చేపట్టాల్సి ఉండగా ఆ పనులు జరగడం లేదు. ప్రతియేటా నాలాల్లో మృతదేహాలు కొట్టుకువస్తున్నాయి.
పూడికతీత పనులు సగమే !
ప్రతియేటా నాలాల్లో పూడికతీత పనులు వేసవిలోగానే పూర్తి కాకపోవడం వల్ల కూడా నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఇంకా సగం పనులు మాత్రమే జరిగాయి. నగరవ్యాప్తంగా 952.71 కి.మీ. పొడవున ఉన్న నాలాల్లో పూడికతీతకు గాను రూ.57 కోట్ల అంచనా వ్యయంతో 201 పనులుగా టెండర్లు పిలిచారు. ఇప్పటి వరకు దాదాపు 470 కి.మీల మేర మాత్రమే పనులు జరిగాయి.
నిబంధనలు కాగితాల్లో..
టౌన్ప్లానింగ్కు సంబంధించి సైతం నిబంధనలు పక్కాగా ఉంటున్నా అమలులో లోపాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎత్తయిన ప్రాంతాలకు దిగువన నివాసాలు ఉండరాదనేది కూడా ఒక నిబంధన. కానీ బాచుపల్లిలో ప్రహరీ కూలి దాని దిగువనున్న కార్మికుల నివాస షెడ్లపై పడటం వల్లే ఏడుగురు మృతి చెందారు
సిద్ధం కాని యంత్రాంగం
అటు టౌన్ప్లానింగ్ విభాగాలు కానీ, ఇటు ఇంజినీరింగ్ విభాగాలు కానీ ఇంకా వర్ష ప్రమాదాల నివారణకు సిద్ధం కాలేదు. మేలో ఎండలు మండుతుండటంతో వర్షాల వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఊహించలేదు. కానీ కురిసిన ఒక్కవానకే సంసిద్ధత ఎంతో బట్టబయలైంది. మరో నాలుగైదు రోజులు కూడా వర్షాలు కురియనున్నట్లు వాతావరణశాఖ సమాచారంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
వర్షాకాల సంసిద్ధతపై కమిషనర్ సమావేశం
వర్షాలు కురుస్తుండటంతో వర్షాకాల సన్నద్ధతపై జీహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్కిళ్ల వారీగా శిథిల భవనాలను, ప్రహరీలను, సెల్లార్ల తవ్వకాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. గుర్తించిన అంశాలు, తీసుకోబోయే చర్యలతో ఈనెల 18వ తేదీ లోగా తనకు నివేదిక అందజేయాలన్నారు. 98 ఫిర్యాదులు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగానికి వర్షానికి సంబంధించి బుధవారం 98 ఫిర్యాదులు రాగా, 78 పరిష్కరించినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి తెలిపారు. చెట్లు కూలిన ఫిర్యాదులు 94 రాగా 75 మధ్యాహ్నం వరకే పరిష్కరించినట్లు తెలిపారు. నీటినిల్వలకు సంబంధించి రెండు ఫిర్యాదులు, మృతదేహాలకు సంబంధించి రెండు ఫిర్యాదులందినట్లు పేర్కొన్నారు.