మద్దికెర: పెరవలి గ్రామంలోని శ్రీరంగనాథస్వామి దేవాలయంలో రాజగోపురం ఎదుట షెడ్డు నిర్మాణం కోసం అదే గ్రామానికి చెందిన తలారి హనుమంతు రావు, శారదమ్మ దంపతులు రూ. 5 లక్షలు విరాళాన్ని ఆలయ చైర్మన్ దస్తగిరిగౌడ్కు పారా చిట్టెన్నకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రాంగణం ముందు షెడ్డు నిర్మిస్తున్నట్లు తెఏలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యుడు లక్ష్మిరెడ్డి, వీఆర్వో రంగస్వామి పాల్గొన్నారు.
మద్దిలేటయ్య క్షేత్రంలో వెలిగిన ఆకాశ దీపం
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ పాండు రంగారెడ్డి, చైర్మన్ రామచంద్రుడు వేదపండితులు జ్వాళా చక్రవర్తి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం సాయంత్రం ఆలయ ఎదురుగా ఉన్న ధ్వజ స్తంభంపై ఆకాశ దీపాన్ని వెలిగించారు.
కులగణనలో నమోదు చేసుకోండి
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న కులగణనలో ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కొమ్ముపాలెం శ్రీనివాస్ కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అప్పట్లోనే భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా, రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ద్వారా బీసీ కులాల జాబితాను తయారు చేసేందుకు, వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారన్నారు. సంక్షేమ అభివృద్ధి కోసం విద్య, వైద్యం, తాగునీరు, శానిటేషన్ అనే అంశాలు తెలుసుకునేందుకు కుల సర్వే చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 162 రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఈ సర్వేతో ఏ కులానికి ఎంత మేర బడ్జెట్ కేటాయించాలనే విషయాలు కూడా స్పష్టమవుతామన్నారు. కులగణనతో అనేక అంశాలు ముడిపడి ఉన్నందున ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు.
మహానందిలో భక్తుల రద్దీ
మహానంది: కార్తీకమాసం, సెలవురోజు, పెళ్లిళ్లు అధికంగా ఉండటంతో ఆదివారం మహానంది ఆలయానికి భక్తులు పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలు కళకళలాడాయి. వేకువజామున నుంచి ప్రారంభమైన శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి దర్శనం రాత్రి వరకు నిర్విరామంగా కొనసాగింది. దేవస్థానం పరిధిలో ఒకే రోజు సుమారు 20కిపైగా పెళ్లిళ్లు జరగడంతో పెళ్లిసందడి నెలకొంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఈఓ కాపు చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఏర్పాట్లు చేపట్టారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు.