నంద్యాల: వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా లభిస్తోందని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ తెలిపారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వైఎస్సార్ కల్యాణమస్తు/వైఎస్సార్ షాదీ తోఫా కింద జులై–సెప్టెంబర్ 2003 త్రైమాసికంలో వివాహం చేసుకున్న 10,511 మంది అర్హులైన జంటలకు రూ.81.64 కోట్ల ఆర్థిక సహాయాన్ని బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎరబ్రోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి, లబ్ధిదారులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో నాల్గవ విడతలో అర్హులైన 428 మంది జంటలకు రూ.3.59 కోట్లు జమ చేశారన్నారు. జిల్లాలో గత మూడు విడతలలో 1,674 మంది లబ్ధిదారులకు రూ.13,92,00,000 జమ చేశారన్నారు. జెడ్పీ చైర్మన్ ఎరబ్రోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించడం గొప్ప విషయం అన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి.. వైఎస్సార్ కల్యాణమస్తు వైఎస్సార్ షాది తోఫాల కింద పేద జంటలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారన్నారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, మైనార్టీ సలహా దారుడు హాబీబుల్లా, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళా రెడ్డి, రాష్ట్ర హస్త కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ శాఖ డీడీ చింతామణి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.