● బీసీ సంక్షేమ శాఖలో సంస్కరణలు
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ బీసీ వసతి గృహాలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పలు సంస్కరణలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా త్వరలో మెనూ యాప్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 47 ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 10 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులు వసతి పొందుతున్నారు. వసతి గృహ సంక్షేమాధికారులు రెగ్యులర్గా హాస్టల్కు వెళ్తున్నారా.. మెనూ అమలు చేస్తున్నారా.. విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారా.. తదితర అంశాలపై జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే వసతి గృహ సంక్షేమాధికారులకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అమల్లో ఉంది. అలాగే విద్యార్థులు అందిస్తున్న మెనూకు సంబంధించి ఇప్పటి వరకు ఆయా వసతి గృహాల్లో తయారు చేసిన ఆహార పదార్థాల ఫొటోలను వాట్సాప్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే కొందరు హెచ్డబ్ల్యూఓలు పాత ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారనే అనుమానంతో కొత్తగా మెనూ ఇంప్లిమెంటేషన్కు సంబంధించి సాంకేతికతను నిక్షిప్తం చేసి మరో యాప్ను అమల్లోకి తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ అనుమతితో ఈ యాప్ను ప్రారంభింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యాప్ అమల్లోకి వస్తే నిబంధనలను ఉల్లంఘించకుండా ప్రభుత్వం రూపొందించిన మెనూను పక్కాగా అమలు చేయడంతో పాటు ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.