వెలుగోడు: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆ పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సూచించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బుధవారం వేల్పనూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డితో రామసుబ్బారెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, నియోజకవర్గ ఎన్నికల అబ్జర్వర్ హబీబుల్లా సమావేశమయ్యారు. పార్టీ నేతలు ఐక్యతతో ఎన్నికల్లో కలిసి పని చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి బుడ్డా వెంగల్రెడ్డికి వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవన్నారు. వైఎస్ఆర్ మరణాంతరం బుడ్డా శేషారెడ్డి వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశారన్నారు. శ్రీశైలంలో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి 2019 కంటే ఈసారి అత్యధిక మెజారిటీతో శిల్పా చక్రపాణిరెడ్డిని, నంద్యాల ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డిలను గెలిపించేందుకు కృషి చేయాలని నేతలుకు సూచించారు.
మరింత బలం..
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డితో కలిసి పని చేయడంతో నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. 1989 నుంచి బుడ్డా కుటుంబంతో తనకు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డిని కలిసి ముందుకు వెళ్తామన్నారు. బుడ్డాను కలుపుకొని ఎన్నికల్లో పని చేసి మళ్లీ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు. టీడీపీని ఓడించేందుకు అందరం ఐక్యంగా పని చేస్తామన్నారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలందరం కలిసి కట్టుగా పని చేస్తామని చెప్పారు.
సీఎం ఆదేశాలను ధిక్కరించలేదు..
పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆదేశాలను తాను ఎప్పుడూ ధిక్కరించలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాల కోసం మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంతో పని చేస్తామన్నారు. రాజకీయాల్లో పది మందికి సాయం చేయాలన్నది మా తండ్రి బుడ్డా వెంగళ్రెడ్డి నుంచి నేర్చుకున్నానని, ఆ దిశగానే తాను పని చేస్తున్నానని చెప్పారు. చక్రపాణిరెడ్డికి విజయానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. గురువారం శిల్పా నామినేషన్ కార్యక్రమంలో అందరం పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పారు.
వైఎస్ఆర్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్
రామసుబ్బారెడ్డి