కోస్గి: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని.. ప్రజలు తమ ఓటును ధైర్యంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. శనివారం పట్టణంలో పోలీసులు, కేంద్ర ప్రత్యేక బలగాలతో ప్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకే పోలీసుశాఖ ప్లాగ్మార్చ్ నిర్వహిస్తోందన్నారు. ప్రజల్లో మనోధైర్యం నింపడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే పోలీసుశాఖ లక్ష్యమని తెలిపారు. సీఐ జనార్దన్, ఎస్ఐలు శ్రీనివాసులు, నరేష్, ఆర్ఏఎఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రియాంకగాంధీ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 27న కాంగ్రెస్పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ కోస్గికి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభకు సంబంధించిన భద్రత ఏర్పాట్లను శనివారం ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. తాండూర్ రోడ్లో నిర్వహించే సభాస్థలి, గ్యాలరీ ఏర్పాటు, పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బారికేడ్లు, తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్పీ వెంట సీఐ జనార్దన్, ఎస్ఐ శ్రీనివాసులు, కాంగ్రెస్పార్టీ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఎస్పీ యోగేష్ గౌతమ్