టీకా వేయించుకోకున్నా సర్టిఫికెట్‌ వచ్చింది! 

29 Jun, 2021 04:31 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన 13ఏళ్ల వేదాంత్‌కు కోవిడ్‌ టీకా వేసినట్లు ఆయన తండ్రికి మెసేజ్‌ వచ్చింది. పైగా వేదాంత్‌ వయసు 56గా మెసేజ్‌లో పేర్కొన్నారు. దీంతో షాకైన బాలుడి తండ్రి రజత్‌ డాంగ్రె అ విషయమై ఫిర్యాదు చేద్దామని ప్రయత్నించినా ఫలితం రాలేదని చెప్పారు. వేదాంత్‌ దివ్యాంగుడని, కొన్ని రోజుల క్రితమే తనకు పెన్షన్‌ కోసం వివరాలను మున్సిపాలిటీలో ఇచ్చానని తెలిపారు.

ఇటీవలే మధ్యప్రదేశ్‌ రికార్డు స్థాయిలో టీకాలు వేసినట్లు వార్తలకెక్కింది. అయితే తమకు టీకా వేయించుకోకున్నా, బెనిఫిషియరీ సర్టిఫికెట్‌ వచ్చిందన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. తనకు అసలు పరిచయం లేని ముగ్గురు పేర్లతో మెసేజులు వచ్చాయని సత్నాకు చెందిన చైనేంద్ర పాండ్య చెప్పారు. తానే ఇంతవరకు టీకా వేయించుకోలేదని, ఎవరికో టీకా వేసిన మెసేజ్‌లు తనకు ఎందుకు వచ్చాయో తెలియట్లేదని వాపోయారు. అయితే ఈ వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇలాంటి ఫిర్యాదులేమైనా అధికారికంగా వస్తే విచారణ చేస్తామని వైద్యమంత్రి చెప్పారు. 

>
మరిన్ని వార్తలు