గగనంలో ఘన చరిత్ర | Sakshi
Sakshi News home page

గగనంలో ఘన చరిత్ర

Published Tue, Jan 12 2021 4:31 AM

Air India flight with all-woman crew from San Francisco lands in Bengaluru - Sakshi

సాక్షి బెంగళూరు: పూర్తిగా మహిళా పైలట్ల సారథ్యంలోనే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం సుదీర్ఘ ప్రయాణం తర్వాత బెంగళూరుకు చేరుకుంది. తద్వారా వారు సరికొత్త చరిత్ర లిఖించారు. కెప్టెన్‌ జోయా అగర్వాల్, కెప్టెన్‌ పాపగారి తన్మయి, కెప్టెన్‌ ఆకాంక్ష సోనావరే, కెప్టెన్‌ శివానీ మన్హాస్‌ అనే నలుగురు పైలట్లు ఈ విమానాన్ని విజయవంతంగా నడిపించారు. సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు. పాపగారి తన్మయి తెలుగు యువతి కావడం విశేషం. విమానం శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30 గంటలకు బయలుదేరింది. అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా అత్యంత క్లిష్టమైన ఉత్తర ధ్రువం గుండా ఎక్కడా ఆగకుండా(నాన్‌స్టాప్‌) ప్రయాణించి బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ల్యాండయ్యింది. మొత్తం 13,993 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటల్లో అధిగమించింది.

మహిళలకు సాధ్యం కానిది ఏదీ లేదు
పూర్తిగా మహిళా పైలట్లతోనే ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపి చరిత్ర సృష్టించామని పైలట్‌ జోయా అగర్వాల్‌ అన్నారు. ఈ మార్గంలో ప్రయాణం ద్వారా 10 టన్నుల ఇంధనాన్ని ఆదా చేసినట్లు పేర్కొన్నారు. మహిళలకు సాధ్యం కానిది ఏదీ లేదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు చేరుకున్న విమానం 

Advertisement
Advertisement