మయన్మార్‌ సరిహద్దుల్లో కంచె | Sakshi
Sakshi News home page

మయన్మార్‌ సరిహద్దుల్లో కంచె

Published Sun, Jan 21 2024 4:23 AM

Amit Shah announces govt to built fence on Myanmar border - Sakshi

గువాహటి: భారత్‌–మయన్మార్‌ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. మయన్మార్‌తో సరిహద్దులకు కూడా పూర్తి స్థాయిలో ముళ్ల కంచె నిర్మిస్తామని చెప్పారు. రెండు దేశాల సరిహద్దుల్లో ప్రజలు స్వేచ్ఛగా సంచరించే వెసులుబాటును సైతం రద్దు చేసేందుకు యోచిస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

భారత్‌ –మయన్మార్‌ మధ్య అరుణాచల్‌ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరంల రాష్ట్రాల మీదుగా 1,643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుంది. యాక్ట్‌ ఈస్ట్‌ విధానంలో భాగంగా 2018 నుంచి సరిహద్దులకు ఇరువైపులా 16 కిలోమీటర్ల దూరం వరకు వీసా లేకుండా ప్రజలు సంచరించేందుకు కేంద్రం వీలు కలి్పంచింది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని మయన్మార్‌కు చెందిన వేలాది మంది భారత భూభాగంలో అక్రమంగా నివాసం ఉండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అమిత్‌ షా ప్రకటనతో అక్రమ చొరబాట్లతో ఇక చెక్‌ పడనుంది. శనివారం అమిత్‌ షా అయిదు అస్సాం పోలీస్‌ కమాండో బెటాలియన్ల మొదటి బ్యాచ్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌నుద్దేశించి, ఆ తర్వాత సలోనిబారిలో సశస్త్ర సీమాబల్‌ 60వ అవతరణ దినోత్సవంలో మాట్లాడారు. సరిహద్దులను కాపాడటంతోపాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా తమ విధులను ఎస్‌ఎస్‌బీ, ఇతర కేంద్ర బలగాలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాయని కొనియాడారు.

ప్రధాని మోదీ హయాంలో పదేళ్లలో దేశంలో శాంతిభద్రతలు గణనీయంగా మెరుగయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు సంధించారు. కాంగ్రెస్‌ హయాంలో ఉద్యోగాలు రావాలంటే యువత లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, నేడు బీజేపీ పాలనలో ఉద్యోగాల కోసం ఒక్క పైసా కూడా ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్టపై ఆయన..దాదాపు 550 ఏళ్ల తర్వాత రామ్‌ లల్లా తిరిగి అయోధ్యకు రావడం యావత్‌ దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. మూడేళ్లలో దేశంలో నక్సల్స్‌ ఉనికి లేకుండా చేస్తామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement