Bihar Hooch Tragedy: 11 Dead, 5 Arrested, SHO Suspended - Sakshi
Sakshi News home page

Bihar Hooch Tragedy: బిహార్‌లో కల్తీ మద్యం కలకలం.. 11మంది మృతి

Published Sat, Aug 6 2022 2:06 PM

Bihar Hooch Tragedy: 11 Dead 5 Arrested SHO Suspended - Sakshi

పాట్నా: కల్తీ మద్యం తాగి 11 మంది చనిపోగా 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో చాలా మంది కంటిచూపు కూడా పోగొట్టుకున్నారు. ఈ ఘటన బిహార్‌లోని సరన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి కారకులను గుర్తించేందుకు మకేర్, మర్హౌరా, భెల్డి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోలీసులు దాడులు జరుపుతున్నారు. కల్తీ సారాను తయారీ, విక్రయించినందుకు ఇప్పటి వరకు అయిదుగురిని అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ సంతోష్‌ కుమార్‌ తెలిపారు.  

కల్తీ సారా తాగి ఇద్దరు మరణించినట్లు మరికొంతమంది అనారోగ్యానికి గురైనట్లు గురువారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ రాజేష్ మీనా తెలిపారు. మకేర్‌ర్ పోలీసు స్టేషన్ పరిధిలో కల్తీసారా బాధితుల ఘటనలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. బాధితులంతా ఈ నెల 3న శ్రావణమాస పండుగ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం మత్తు పదార్థాలను సేవించినట్లు తేలిందని అధికారులు తెలిపారు.
చదవండి: ప్రియాంక గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. వీడియో దృశ్యాలు..

పోలీసులు, ఎక్సైజ్‌, వైద్యాధికారుల బృంధం ఘటన స్థలానికి చేరుకొని బాధితులను సదర్‌ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.  పరిస్థితి విషమంగా ఉన్న వారిని పాట్నాలోని పిఎంసిహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తొమ్మిది మంది, ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకరు మరణించారు. అంతేగాక అధికారులకీ విషయం తెలియక ముందే ఒకరిని దహనం చేశారని  తెలిపారు. మరో 12 మంది పన్నెండు మంది ఇంకా చికిత్స పొందుతున్నారని  అధికారులు తెలిపారు.

మరోవైపు కల్తీ మద్యం విక్రయాన్ని ముందుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు స్థానిక పోలీస్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం 2016లో బిహార్‌లో మద్యం నిషేధించింది. అయితే  2021 నవంబర్‌ నుంచి జరుగుతున్న కల్తీ మద్యం ఘటనల్లో 50 మందికి పైగా చనిపోయారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement