Yediyurappa Presented Best Legislator Award: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయిన బీఎస్ యడియూరప్ప 2020-21 సంవత్సరానికి గాను ఉత్తమ శాసనసభ్యుడిగా ఎంపికయ్యాడు. అసెంబ్లీ స్పీకర్ నేతృత్వంలోని.. సీఎం బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, న్యాయశాఖ మంత్రి మధుస్వామిలతో కూడిన కమిటీ ఈ అవార్డుకి యడియూరప్పని ఎంపిక చేసింది. అసెంబ్లీ సభ్యుడిగా ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను యడియూరప్పకి ఈ అవార్డు దక్కిందని కమిటీ పేర్కొంది.
పార్లమెంట్లో ఏటా అందించే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల తరహాలో ఈ ఏడాది నుంచి కర్ణాటక శాసనసభ సభ్యులకు(మంత్రులకు కాదు) బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు ఇచ్చే ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు అసెంబ్లీ స్పీకర్ తెలిపారు. ఇవాళ(సెప్టెంబర్ 24) ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. యడియూరప్పకి జ్ఞాపికను బహుకరించారు.
కార్యక్రమానికి సీఎం బసవరాజ్ బొమ్మై, శాసనసభ స్పీకర్ విశ్వేశ్వర్ హేగ్డే, శాసనమండలి చైర్మన్ బసవరాజ్ హోరట్టి తదితరులు హాజరయ్యారు. కాగా, యడియూరప్ప 1983లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శాసన మండలి, పార్లమెంట్ సభ్యుడిగా కూడా పని చేసిన ఆయన.. నాలుగు సార్లు సీఎం అయ్యారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ ఏడాది జులై 26న సీఎం పదవికి రాజీనామా చేసిన యడియూరప్ప ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
చదవండి: భార్య రోజూ స్నానం చేయడం లేదు.. విడాకులు కోరిన భర్త!