Center Alert States On Increase In Coronavirus Cases Abroad - Sakshi
Sakshi News home page

కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

Published Tue, Dec 20 2022 7:52 PM

Center Alerts States On Increase In Corona Virus Cases Abroad - Sakshi

న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కోవిడ్‌ కేసులు భారీగా నమోదవుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. విదేశాల్లో కరోనా కేసుల పెరుగుదలపై భారత్‌ అప్రమత్తమైంది. కోవిడ్‌ కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని, పాజిటివ్‌ కేసుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని సూచించింది. ఇన్సాకాగ్‌ నెట్‌వర్క్‌ ద్వారా కొత్త కేసులను ట్రాక్‌ చేయాలని సూచిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. 

‘జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్‌, చైనాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లను ఇన్సకాగ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ట్రాక్‌ చేసేందుకు పాజిటివ్‌ కేసుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలి. అలా చేయడం ద్వారా సరైన సమయంలో కొత్త వేరియంట్లను గుర్తించగలుగుతాం. దానికి తగినట్లుగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతాం.’

- కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషన్‌. 

ప్రజాగ్రహంతో ఇటీవలే కరోనా ఆంక్షలను సడలించింది చైనా. దీంతో రోజువారి కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో ఆ దేశ జనాభాలో 60 శాతం మంది ప్రజలు కోవిడ్‌ బారినపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో మంగళవారం 112 కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 3,490 ఉన్నాయి.

ఇదీ చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు.. లక్షల్లో మరణాలు!

Advertisement
Advertisement