పళని సర్కార్‌కు కేంద్రం షాక్‌! | Sakshi
Sakshi News home page

పళని సర్కార్‌కు కేంద్రం షాక్‌!

Published Wed, Jan 6 2021 8:46 PM

Centre shot a letter to Tamilnadu government to revoke hundred percent seating for cinema shows - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:  థియేటర్స్ లో సీటింగ్ సామర్ధ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుకోవచ్చంటూ జీవో జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వానికి షాక్ తగిలింది. దేశంలో  కరోనా మహమ్మారికి ఇంకా కళ్లెం పడకపోవడం, కొత్త కరోనా వైరస్‌ ఆందోళన రేపుతున్న తరుణంలో కేంద్రం తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో 100 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనకు అనుమతినిస్తున్న జీవోను రద్దు చేయాలని  కేంద్రం  ఒక లేఖ రాసింది.  

తమిళ సర్కారు తాజా నిర్ణయం కేంద్రం డిసెంబరు 28న జారీ చేసిన  కోవిడ్‌-19 మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉందని కేంద్రం అసంతృప్తి  వ్యక్తం  చేస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు.  100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనల ఆదేశాలను ఉపసంహరించుకోవాలని , తమ ఆదేశాన్ని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం అన్ లాక్ ప్రక్రియలో భాగంగా 50 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలకు మాత్రమే అనుమతిచ్చిందని, ఈ ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించారన్నారు. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం కేంద్ర మార్గదర్శకాలను తమకు అనుగుణంగా మార్చుకోరాదని ఆయన స్పష్టం  చేశారు.అలాగే  సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ మాస్కులు, భౌతికదూరం నిబంధనలు తప్పనిసరి  చేసిందని కూడా గుర్తు చేసింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని తమిళనాడు ప్రభుత్వం తన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు.

కాగా వంద శాతానికి సీటింగ్ సామర్ధ్యాన్ని పెంచడాన్ని అరవింద్ స్వామి వంటి వారు వ్యతిరేకించగా, నటి, ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన ఖుష్బూ మద్దతు పలికారు.అటు పుదిచ్చేరికి చెందిన ఒక డాక్టర్ 100 శాతం ఆకుపెన్సీ అవకాశాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్టును ట్యాగ్ చేస్తూ కొందరు తమిళ సినీ ప్రముఖుల తమిళ నాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పు పట్టారు. అలాగే టాలీవుడ్‌లో కూడా 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించాలని  కోరుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల నిర్మాతల మండలి  విజ్ఞప్తి చేయడం విశేషం. మరోవైపు ఈ నెల 13న  హీరో విజయ్ నటించిన  ‘మాస్టర్’, శింబు నటించిన ఈశ్వరన్‌ చిత్రాలు విడుదల కానున్నాయి. (మాస్టర్‌ హిందీ వెర్షన్‌ ఈనెల 14న విడుదల కానుంది.)  ఈ నేపథ్యంలో  కేంద్రం తాజా ఆదేశాలు చర్చకు తెర తీశాయి.

Advertisement
Advertisement