చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ కక్ష్య పెంపు విజయవంతం | Sakshi
Sakshi News home page

Chandrayaan-3: విజయవంతంగా చంద్రయాన్‌-3 స్పేస్‌ క్రాఫ్ట్‌ కక్ష్య పెంపు

Published Mon, Jul 17 2023 9:29 PM

Chandrayaan 3: ISRO successfully completes second orbit raising manoeuvre - Sakshi

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌–3 రాకెట్‌ను శుక్రవారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) వేదికగా విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. ఈ వ్యోమనౌక దాదాపు 40 రోజులపాటు అంతరిక్షంలో ప్రయాణించి చివరికి ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై దిగనుంది. జాబిల్లిపై ఉన్న రహస్యాలు ఛేదించేందుకు పంపిన చంద్రయాన్‌-3 ప్రస్తుతం కీలక దశ దిశగా సాగుతోంది. 

ఇస్రో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో స్పేస్‌ క్రాఫ్ట్‌ విజయవంతంగా ప్రయాణిస్తోంది.  చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగంగా ఇప్పటికే ఒకసారి మిషన్‌ కక్ష్యను పెంచిన ఇస్రో శాస్త్రవేత్తలు.. నేడు(సోమవారం) రెండోసారి మూన్‌ మిషన్‌ కక్ష్యను పెంచే ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. భారత్‌ పంపిన ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూమికి 41,603 కిలోమీటర్లు X 226 కిలోమీటర్ల దూరంలోగల కక్ష్యలో ఉందని బెంగుళూరులో జాతీయ అంతరిక్ష సంస్థ సోమవారం తెలిపింది.  

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య మరోసారి స్పేస్‌ క్రాఫ్ట్‌ ఇంజిన్‌లను మండించి కక్ష్యను మరింత పెంచనున్నట్లు పేర్కొంది. కాగా, చంద్రయాన్‌-3 ప్రయోగం మొత్తంలో రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దించడమే తమ ముందున్న అసలైన సవాలని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చదవండి: ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్‌ని దించడమే ముందున్న లక్ష్యం

Advertisement
Advertisement