రాయ్పూర్: మేనకోడలికి పెళ్లి అయిందనే పట్టరాని సంతోషంలో స్టేజీపైనే డ్యాన్స్ చేసిన ఓ వ్యక్తి సడన్గా గుండెపోటుతో కుప్పకూలాడు. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా నృత్యం చేసిన అతడు ఉన్నట్టుంది ఛాతీలో ఇబ్బందిగా అన్పించి పెళ్లి వేదికపైనే కూర్చుండిపోయాడు. ఆ తర్వాత క్షణాల్లోనే సృహకోల్పోయి పడిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో పెళ్లి సంబరాల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయారు.
ఛత్తీస్గఢ్ రాజనందన్గావ్ జిల్లా డోంగర్గఢ్లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు దిలీప్ రాజ్కుమార్. బాలోద్ జిల్లాలో నివసిస్తున్నాడు. భిలాయ్ స్టిల్ ప్లాంట్లో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు.
పెళ్లివేదికపై దిలీప్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను అక్కడున్నవారు తమ ఫోన్లో వీడియో తీశారు. ఈ సమయంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలడంతో ఆ దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాసేపట్లోనే వైరల్గా మారింది.
కాగా.. ఈ మధ్య గుండెపోటు ఘటనలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబధం లేకుండా, యువకులు, పెద్ద వయస్కులు అనే తేడా లేకుండా చాలా మంది హఠాత్తుగా హార్ట్ఎటాక్తో కుప్పకూలుతున్నారు. జిమ్లో వ్యాయామం చేస్తూ, గేమ్స్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కల్గిస్తోంది. చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు