Sakshi News home page

ఛత్తీస్‌గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి

Published Sun, Dec 10 2023 3:39 PM

Chhattisgarh New CM Vishnu Dev Sai - Sakshi

ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. దీంతో రాష్ట్రంలో సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. రాయ్‌పూర్‌లో బీజేపీ కొత్తగా ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేల కీలక సమావేశం తర్వాత విష్ణు దేవ్ సాయిని సీఎంగా ప్రకటించారు.

ఇటీవల ముగిసిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ పోటీలో నిలిచింది. మొత్తం 90 స్థానాలకు గాను 54 స్థానాలను కైవసం చేసుకుని ఘనవిజయం సాధించింది. గెలుపు అనంతరం సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై గత వారం రోజులుగా బీజేపీ పెద్దలు నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు నేటి సమావేశంలో విష్ణుదేవ్ సాయిని సీఎంగా ఎంపిక చేయడానికే బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. గిరిజన వర్గానికి చెందిన విష్ణు దేవ్ సాయి .. ఈ ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎత్తున గిరిజనుల మద్దతు కూడగట్టారు.

కుంకూరి అసెంబ్లీ స్థానంలో విష్ణు దేవ్ సాయి 87,604 ఓట్లతో విజయం సాధించారు. సీఎంగా గిరిజన సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయాలనుకుంటే మాజీ బీజేపీ రాష్ట్ర చీఫ్, విష్ణు దేవ్ సాయి మొదటి స్థానంలో నిలిచారు. మోదీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా, 16వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా కూడా విష్ణు దేవ్ సాయి పనిచేశారు.

ఇదీ చదవండి: మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ ఆనంద్‌

Advertisement

What’s your opinion

Advertisement