‘చైనా, పాక్‌ స్నేహం.. భారత్‌కు సవాలే’ | Sakshi
Sakshi News home page

‘చైనా, పాక్‌ స్నేహం.. భారత్‌కు సవాలే’

Published Sat, Mar 16 2024 1:06 PM

Chinas rise and friendship with Pakistan Chief of Defence Staff Indias challenge - Sakshi

ఢిల్లీ: చైనా దుందుడుకు చర్యలు, అదేవిధంగా డ్రాగన్‌ దేశం పాకిస్తాన్‌తో కొనసాగిస్తున్న స్నేహం భారత్‌కు సవాల్‌గా మారుతోందని చీఫ్‌ ఆప్ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ అన్నారు. ఆ రెండు దేశాల స్నేహం భారత్‌ భద్రతా బలగాలకు ఛాలెంజ్‌ విసురుతోందని పేర్కొన్నారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న అనిల్‌ చౌహాన్‌ పలు విషయాలు పంచుకున్నారు.

పాక్‌, చైనా దేశాల మధ్య స్నేహం రోజురోజుకు హిమాలయాలంత ఎత్తు.. సముద్రమంత లోతుకు విస్తరిస్తోందని అన్నారు. అదే విధంగా ఆ రెండు దేశాలు కూడా అణు సామర్థ్యం కలిగి ఉన్నాయని తెలిపారు. కానీ, ఈ సవాళ్లు తాము ముందునుంచి  ఊహిస్తున్నవేనని ఈయన స్పష్టం చేశారు. మరికొన్ని ఊహించని పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక.. పాకిస్తాన్‌ ఆర్మీని తేలికగా తీసుకుంటున్నామన్న విషయాన్ని ఆయన తోసిపుచ్చారు.

ఇటీవల తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో కొట్టుమిట్టాడిన పాక్‌.. ఇప్పుడిప్పుడే అన్ని రకాలుగా స్థిరత్వాన్ని పొందుతుందన్న విషయాన్ని వెల్లడించారు. ఎప్పటికప్పుడు పాకిస్తాన్‌ ఆర్మీ తన సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని తెలిపారు. తద్వారా పాక్‌తో భారత్‌కు ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదని అనిల్‌ చౌహన్‌ పేర్కొన్నారు. అయితే భారత్‌ సైన్యం సైతం ఎప్పటికప్పుడు తన సామర్థాన్ని పెంచుకుంటోందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement