ఢిల్లీకి కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ కార్యాలయం సిద్ధం | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ కార్యాలయం సిద్ధం

Published Mon, Dec 12 2022 8:57 PM

CM KCR To Inaugurate BRS National Office In Delhi On December 14 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఎల్లుండి (బుధవారం) తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. సర్దార్ పటేల్ మార్గంలోని అద్దె భవనంలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో కార్యాలయం బయట భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

బుధవారం ఉదయం 9 గంటల నుంచి నవ చండీయాగాన్ని ప్రారంభించనున్నారు. ఈ చండీయాగం నిర్వహించేందుకు యాగశాలను నిర్మించి అందులో మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నవ చండీయాగంలో సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. గురువారం మధ్యాహ్నం 12.37 నిమిషాల సమయంలో  పూర్ణాహుతిలో పాల్గొంటారని వాస్తు నిపుణులు తేజ వెల్లడించారు.

అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ వర్గాన్ని కూడా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ విధి విధానాలను కూడా కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజా ప్రతినిధులు సుమారు 1500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వీలును బట్టి భావసారుప్యత కలిగిన నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగానే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చదవండి: ఎమ్మెల్యే టికెట్లపై తేల్చేసిన కేసీఆర్‌, తగ్గేదేలే! అంటున్న బొంతు?

Advertisement
Advertisement