Sakshi News home page

ఎర్ర‌కోట వేడుక‌కు హాజ‌రుకాని మ‌ల్లికార్జున ఖ‌ర్గే.. నెట్టింట వైరల్‌గా ఖాళీ కుర్చి

Published Tue, Aug 15 2023 3:05 PM

Congress Chief Mallikarjun Kharge Skips Independence Day Ceremony At Red Fort - Sakshi

న్యూఢిల్లీ: 77వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సంద‌ర్భంగా ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎగురవేశారు. అనంతరం ప్రధాని దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మాన్ని అతిథులు అంద‌రూ వ‌చ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే హాజ‌రుకాలేదు. దీంతో ఆయన కుర్చీ ఖాళీగా క‌నిపించింది.

వేడుకకు ఆయన హాజరుకాకపోయినా.. ఖ‌ర్గే త‌న ట్విట్ట‌ర్‌లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఓ వీడియో షేర్‌ చేశారు.అందులో.. గాంధీ, నెహ్రూ, వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌, నేతాజీ, మౌలానా ఆజాద్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, స‌రోజిని నాయుడు, అంబేద్క‌ర్‌కు నివాళి అర్పించారు. భార‌త దేశ తొలి ప్ర‌ధాని నెహ్రూతో పాటు ఇందిరా గాంధీ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, న‌ర్సింహారావు, మ‌న్మోహ‌న్ సింగ్‌, అత‌ల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి చేసిన మేలు గురించి వివ‌రించారు. ప్ర‌తి ప్ర‌ధాని దేశ ప్ర‌గ‌తి కోసం ఎంతో కొంత స‌హ‌క‌రించార‌ని, కానీ ఈ రోజుల్లో కొంద‌రు మాత్రం గ‌త కొన్నేళ్ల‌లోనే దేశం ప్రగ‌తి సాధించిన‌ట్లు చెబుతున్నారని ఆరోపించారు.

ప్ర‌తిప‌క్షాల గొంతును నొక్కేందుకు కొత్త విధానాల‌ను వాడుతున్నార‌ని, సీబీఐ, ఈడీ, ఐటీతో దాడులు చేయిస్తున్నార‌ని, ఎన్నిక‌ల సంఘాన్ని బ‌ల‌హీన‌ప‌రిచార‌ని, విప‌క్ష నోళ్ల‌ను మూయిస్తున్నార‌ని, వాళ్ల మైక్‌ల‌ను లాగేసి స‌స్పెండ్ చేస్తున్నార‌ని ఖ‌ర్గే ఆరోపించారు.  ఇదిలా ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా మల్లికార్జున్ ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని కాంగ్రెస్ తెలిపింది.

Advertisement
Advertisement