Made Enough Money In The Name Of Gandhis, Congress MLA Ramesh Kumar Says Viral - Sakshi
Sakshi News home page

Congress MLA Ramesh Kumar: గాంధీల పేరుతో కావాల్సినంత డబ్బు సంపాదించాం: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

Published Fri, Jul 22 2022 8:21 AM

Congress MLA Claimed Made Enough Money in The Name of Gandhis - Sakshi

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. గాంధీలు, నెహ్రూ పేరుతో కాంగ్రెస్‌ నేతలు కావాల్సినంత డబ్బు సంపాదించారని పేర్కొన్నారు. సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనల వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జవహార్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల పేరుతో మనము 3-4 తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకున్నాం. మనం ఈమాత్రం త్యాగం చేయలేకపోతే.. అది మనకే మంచిది కాదు.’ అని పేర్కొన్నారు. 

ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ కే. ‘కాంగ్రెస్‌ పార్టీ గత 60 ఏళ్లలో ఏ విధంగా దేశాన్ని దోచుకుందనే విషయాన్ని ఎంతో అందంగా వివరించిన తెలివైన నేతకు నా శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. 

నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన కేసులో గురువారం ఈడీ ముందు హాజరయ్యారు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇందులో భాగంగానే బెంగళూరులోని పార్టీ కార్యాలయం నుంచి క్వీన్స్‌ రోడ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు. అనంతరం ఫ్రీడమ్‌ పార్క్‌లో సమావేశం ఏర్పాటు చేసి నేతలు మాట్లాడారు.

ఇదీ చదవండి: National Herald Case: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ

Advertisement
Advertisement