ప్రధాని మోదీపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Published Mon, Apr 8 2024 4:14 PM

Congress moves Election Commission against PM Modi Muslim League remark - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, రాజ్యసభ ఎంపీ ముకుల్‌ వాస్నిక్‌, పవన్ ఖేరా, గుర్దీప్ సప్పల్‌లతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం మధ్యాహ్నం నిర్వాచన్ సదన్‌లో ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయ్యారు. తమ పార్టీ మేనిఫెస్టోను ముస్లిం లీగ్‌తో పోల్చుతూ మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. అలాగే పార్టీ ఎన్నికల ప్రచారంలో సాయుధ బలగాలను కొనసాగించడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందంటూ బీజేపీపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది

కాగా ఏప్రిల్‌ 6న రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను అబద్దాల మూటగా అభివర్ణించారు. మేనిఫెస్టోలోని ప్రతి పేజీ భారత్‌ను ముక్కలు చేసే ప్రయత్నంగా ఉందన్నారు. ముస్లిం లీగ్ ముద్ర ఉన్న కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్నదంతా వామపక్షాలు స్వాధీనం చేసుకున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు సిద్ధాంతాలు, విధానాలు లేవని విమర్శించారు.  కాంగ్రెస్‌ తమ మొత్తం పార్టీని కాంట్రాక్ట్‌పై అవుట్‌సోర్సింగ్‌కు అప్పగించినట్లు కనిపిస్తోందన్నారు.

అయితే మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 180 సీట్ల మార్కును దాటేందుకు బీజేపీ కష్టపడుతోందని విమర్శలు గుప్పింది. ఆ భయంతోనే మళ్లీ హిందూ-ముస్లిం కథను ఉపయోగిస్తుందంటూ మండిపడింది.
చదవండి: కవితకు దక్కని ఊరట.. మరో పిటిషన్‌!

Advertisement
Advertisement