డీఎంకే, కాంగ్రెస్‌ వైఖరి ఇప్పటికీ అలాగే.. మండిపడ్డ మోదీ | Sakshi
Sakshi News home page

డీఎంకే, కాంగ్రెస్‌ వైఖరి ఇప్పటికీ అలాగే.. మండిపడ్డ మోదీ

Published Fri, Mar 15 2024 2:28 PM

DMK and Congress Can Never Develop Tamil Nadu - Sakshi

తమిళనాడును డీఎంకే - కాంగ్రెస్‌ ఇండియా కూటమి ఎప్పటికీ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చలేవని క‌న్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళలతో ఎలా అనుచితంగా ప్రవర్తించాలో కాంగ్రెస్, డీఎంకేలకు మాత్రమే తెలుసు. డీఎంకే మహిళల పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

జయలలితకు డీఎంకే నేతలు ఏం చేశారో అందరికీ గుర్తుంది. మహిళల పట్ల వారి వైఖరి ఇప్పటికీ అలాగే ఉంది. తమిళనాడులో మహిళలపై నేరాలు పెరిగాయి. మేము పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ - డీఎంకే మద్దతు ఇవ్వలేదు.

తమిళనాడు ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. నేను ఇటీవల తూత్తుకుడిలో చిదంబరనార్ పోర్టును ప్రారంభించాను. మా ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తోంది. ఆధునిక ఫిషింగ్ బోట్‌లకు ఆర్థిక సహాయం అందించడం నుంచి వాటిని కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం పరిధిలోకి తీసుకురావడం వరకు మేము వారి సంరక్షణను తీసుకున్నామని మోదీ వెల్లడించారు.

ప్రధాని మోదీ తన ప్రభుత్వ సంక్షేమ పథకాలను, డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎత్తిచూపుతూ 2జీ కుంభకోణంతో ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. ఒకవైపు బీజేపీ సంక్షేమ పథకాలు.. మరోవైపు మీ వద్ద INDI అలయన్స్‌ స్కామ్‌ జాబితా ఉంది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ.. తమిళనాడులోని డీఎంకే - కాంగ్రెస్ కూటమి దురహంకారాన్ని బద్దలు కొట్టనుందని మోదీ అన్నారు.

Advertisement
Advertisement