Emperor Jahandar Shah Was Infamous For His Debauchery - Sakshi
Sakshi News home page

వింత మొఘల్‌ పాలకుడు: ఒకసారి నగ్నంగా, మరోసారి స్త్రీల దుస్తులు ధరించి..

Published Mon, Aug 21 2023 11:07 AM

emperor jahandar shah was infamous for his debauchery - Sakshi

1712లో బహదూర్ షా (ప్రథమ) మరణం తరువాత, మొఘల్ పీఠం కోసం అతని కుమారుల మధ్య యుద్ధం జరిగింది. చివరికి జహందర్ షా విజయం సాధించి మొఘల్ సామ్రాజ్య సింహాసనంపై కూర్చున్నాడు. జహందర్ షా తన అసభ్యకర ప్రవర్తన కారణంగా అపఖ్యాతి పాలయ్యాడు. జహందర్ షా మొఘల్ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే తనకు ఎంతో ఇష్టమైన మహిళ లాల్ కున్వర్‌కు అధికార బాధ్యతలను అప్పగించాడు.

అందానికి దాసోహమై..
లాల్ కున్వర్ మొఘల్ ఆస్థాన గాయకుడు ఖాసురత్ ఖాన్ కుమార్తె. లాల్ కున్వర్.. జహందర్ షాకు  రెట్టింపు వయస్సు కలిగినది. ఆమె తన అందం నృత్యంతో విటులను అలరించేంది. లాల్ కున్వర్ చక్రవర్తి జహందర్ షాను తన ఆధీనంలో ఉంచుకున్నదని చరిత్రకారుడు స్మిత్ ‘ది హిందూ’లో ప్రచురితమైన ఒక కథనంలో రాశారు. జహందర్ షా అధికారంలోకి వచ్చిన వెంటనే లాల్ కున్వర్‌కు రాణి హోదాను అ‍ప్పగించాడు. అలాగే ‘ఇమ్తియాజ్ మొఘల్’ అనే బిరుదు కూడా ఇచ్చారు. జహందర్‌ షా అధిక సమయం లాల్ కున్వర్ కోసం వెచ్చించేవాడు. లాల్ కున్వర్ దీనిని తన ప్రయోజనాలకోసం సద్వినియోగం చేసుకున్నది. ఆమె మొదట తన కుటుంబ సభ్యులను మాన్‌సబ్‌లుగా నియమించింది. తరువాత వారు మొఘల్ సామ్రాజ్యం నుండి జాగీర్లు అందుకున్నారు. తరువాత ఆమె తన బంధువులను అన్ని కీలక పదవులలో నియమించింది.

కుమారుల కళ్లను తొలగించి..
లాల్ కున్వర్ ఆధీనంలోకి వెళ్లిన జహందర్ షా  క్రూరమైన, మూర్ఖపు చర్యలకు పాల్పడ్డాడు. చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం జహందర్ కుమారులపై లాల్ కున్వర్‌కు ద్వేషం పెంచుకుంది. అతని  ఇద్దరు కుమారుల కళ్లను తొలగించి, వారిని జైలులో పెట్టాలని జహందర్ షాను కోరింది. జహందర్ షా ఆమె చెప్పినట్టే చేశాడు. అతని క్రూరత్వానికి సంబంధించిన మరొక ఉదంతం ఎంతోప్రసిద్ధి చెందింది. ఒకసారి తన సరదా కోసం జనంతో నిండిన పడవను నీట ముంచి, వారి ఆర్తనాదాలు విని విరగబడి నవ్వాడట.

‘ఇడియట్ మొఘల్ కింగ్’
జహందర్ షా కొన్నిసార్లు పూర్తి నగ్నంగా దర్బారుకు హాజరయ్యేవాడు. మరికొన్నిసార్లు స్త్రీల దుస్తులు ధరించి దర్బారు నిర్వహించేవాడు. జహందర్ షా వికృత చేష్టల కారణంగా అతనికి ‘ఇడియట్ మొఘల్ కింగ్’ అనే పేరు వచ్చింది. అతను మొఘల్ చరిత్రలో అత్యంత తెలివితక్కువ చక్రవర్తి అనే పేరు పొందాడు.

జైలులోనే దారుణ హత్య
జహందర్ మొఘల్ సామ్రాజ్య సింహాసనంపై కేవలం 9 నెలలు మాత్రమే ఉండగలిగాడు. అతని మేనల్లుడు ఫరూక్సియార్ అతనికి వ్యతిరేకంగా ఒక దళాన్ని నడిపాడు. 1713 జనవరి 6న  ఫరూక్సియార్‌తో ఓటమి ఎదురయ్యాక అతను లాల్ కున్వర్‌తో కలిసి ఢిల్లీకి పారిపోయి, అక్కడ ఆశ్రయం పొందాడు. అక్కడ జహందర్‌ను ఖైదు చేశారు. తరువాత అతను జైలులోనే దారుణ హత్యకు గురయ్యాడు.
ఇది కూడా చదవండి: ‘నాన్నా నేను బతికే ఉన్నాను’.. తలకొరివి పెట్టేంతలో తండ్రికి ‘మృతురాలి’ నుంచి ఫోన్‌..

Advertisement
Advertisement