రెండేళ్ల కిందట భర్త మృతి.. తర్వాత తమ్ముడే ఇలా చేస్తాడని ఆమె అనుకోలేదేమో!

18 Sep, 2022 08:30 IST|Sakshi

తుమకూరు: కనిపించకుండా పోయిన హులియూరు పోలీస్‌స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్‌ హత్యకు గురైనట్లు తేలింది. ఆమె చిన్నాన్న కుమారుడు మంజునాథ్‌ (32) హత్య చేసి, ఆపై అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకరాం.. కానిస్టేబుల్‌ ఎస్‌.సుధా (38) ఈ నెల 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పీఎస్‌ నుంచి స్థానికంగా ఉన్న తన ఇంటికి బయల్దేరింది. అయితే ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు 14 సంవత్సరాల కొడుకు, 10 ఏళ్ల కూతురు ఉన్నారు. రెండేళ్ల కిందట భర్త చనిపోయాడు. ఏడాదిన్నరగా హులియూరులో పనిచేస్తున్నారు. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న హులియూరు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.  

హైవే పక్కన మృతదేహాం  
కర్ణాటక రాష్ట్రంలో హాసన్‌ జిల్లాలోని అరిసికెరె తాలూకాలోని అరసికెరె– తిపటూరు మధ్య జాతీయ రహదారి– 206లో మైలనహళ్ళి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం సుధా శవం కనిపించింది. అక్కడి పోలీసులు దర్యాప్తు చేయగా సుధా మృతదేహమని తెలిసింది. మరోవైపు శివమొగ్గలో ఒక లాడ్జిలో మంజునాథ్‌ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.  

ఆస్తి గొడవలే కారణం?  
పోలీసుల విచారణలో చిక్కుముడి వీడింది. సుధా, మంజునాథ్‌ల స్వస్థలం జిల్లాలోని చిక్కనాయకనహళ్లి. వీరికి డబ్బులు, ఆస్తి గొడవలు ఉన్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడుదామని చెప్పి సుధాను మంజునాథ్‌ కారులో తీసుకెళ్లి హత్య చేశాడు. అతని వద్ద డెత్‌నోటు దొరికింది, తానే సుధాను హత్య చేశానని, అందువల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు