బుగ్గిపాలైన మురికివాడ: 700 గుడిసెలు మంటల్లో.. | Sakshi
Sakshi News home page

బుగ్గిపాలైన మురికివాడ: 700 గుడిసెలు మంటల్లో..

Published Sat, Apr 3 2021 2:22 PM

Fire Accident In Slum Area, 700 Huts In Flames - Sakshi

గుర్గావ్‌: ఒక గుడిసెలో చెలరేగిన మంటలు కొన్ని నిమిషాల వ్యవధిలో మురికివాడంతా వ్యాపించాయి. దీంతో ఆ వాడలో ఉన్న 700 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ ప్రమాదం నుంచి బస్తీవాసులు తృటిలో తప్పించుకున్నారు. ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. కాకపోతే వారి నిత్యావసరాలు.. సామగ్రి, దాచుకున్న సొమ్మంతా బుగ్గిపాలయ్యాయి. దీంతో వారంతా రోడ్డుపై పడ్డారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

హరియాణాలోని గుర్గావ్‌ సమీపంలో ఉన్న నాథూపుర మురికివాడలో శనివారం తెల్లవారుజామున ఓ పూరి గుడిసెలో మంటలు వ్యాపించాయి. వాటిని ఆర్పేలోపు పక్కనే ఉన్న మరో గుడిసెకు ఆ విధంగా గుడిసె గుడిసెకు అంటుకుంటూ ఏకంగా 700 గుడిసెలు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గుడివాసులు వాటికి దూరంగా వచ్చారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. గంటన్నర పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటో తెలియడం లేదు.
 

Advertisement
Advertisement