సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్‌ భేటీ | Sakshi
Sakshi News home page

సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్‌ భేటీ

Published Sun, Mar 31 2024 5:29 AM

Former chief minister Hemant Soren wife Kalpana meets Sunita Kejriwal - Sakshi

న్యూఢిల్లీ: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ శనివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్డులో ఉన్న సీఎం నివాసానికి ఆమె వెళ్లారు. సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్‌లు సుమారు 20 నిమిషాల సేపు మాట్లాడుకున్నారని అధికారులు తెలిపారు. అనంతరం కల్పన మీడియాతో మాట్లాడారు. ‘సునీతా జీతో ఆవేదన, బాధను పంచుకునేందుకు ఇక్కడికి వచ్చా. ఆమె తన పరిస్థితిని వివరించారు.

తుది వరకు పోరాడాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. యావత్తూ జార్ఖండ్‌ ప్రజలు కేజ్రీవాల్‌ వెన్నంటే ఉంటారు’అని చెప్పారు. ‘జార్ఖండ్‌లో రెండు నెలల క్రితం జరిగిందే ఢిల్లీలో పునరావృతమైంది. నా భర్త హేమంత్‌ జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్‌ కస్టడీలో ఉన్నారు. జార్ఖండ్, ఢిల్లీల్లో పరిస్థితులు ఒకేలా ఉన్నాయి’అని చెప్పారు.

కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీని కలిసి, పరిస్థితిని వివరిస్తానన్నారు. భూకుంభకోణం మనీ లాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ను ఈడీ జనవరిలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా, కల్పనా సోరెన్, జార్ఖడ్‌ సీఎం చంపాయి సోరెన్‌తోపాటు ఆదివారం ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొంటారని సమాచారం. సునీతా కేజ్రీవాల్‌ కూడా ర్యాలీలో పాలు పంచుకుంటారని ఆప్‌ నేతలు తెలిపారు.
 

Advertisement
Advertisement