దారుణం: కుంగిన రహదారి.. లోయలో బస్సు బోల్తా.. ఏడుగురి మృతి..
Published
Sat, Aug 12 2023 2:24 PM
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో దారుణం జరిగింది. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సిమ్లాకు వెళ్లే దారిలో మండి జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రహదారి దెబ్బతిన్న కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జాతీయ రహదారి 5పై ఉన్న సిమ్లా-కల్కా రోడ్డును గత కొద్దిరోజులుగా మూసి ఉంచారు. గురువారమే ఆ దారిలో తేలిపాటి వాహనాలకు అనుమతులు ఇచ్చారు. ఆ రహదారిలో బస్సు రావడంతో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో ప్రమాదం జరిగింది. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
వర్షాలతో రాష్ట్రంలో దాదాపు 200 రోడ్డు మార్గాలను మూసివేశారు. సుమారు 200 మార్గాల్లో ఎలక్ట్రిసిటీని కూడా నిలిపివేశారు. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో తేలికపాటి వాహనాలను అనుమతించారు. దీంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.