కరోనా సెకండ్ వేవ్: ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు
Published
Tue, Apr 20 2021 11:11 AM
న్యూఢిల్లీ : భారత్లో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండటంతో పరీక్షలు ఒక్కొక్కటిగా రద్దవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. మరికొన్ని వాయిదా వేశాయి. తాజాగా మరో పరీక్ష రద్దయ్యింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (ఐసీఎస్ఈ) పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 16వ తేదీన జారీ చేసిన సర్క్యూలర్ను ఉపసంహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ ఆరోగ్యం ముఖ్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఎస్ఈ పేర్కొంది. అయితే ఐసీఎస్ఈ ఇంటర్ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం ఆఫ్లైన్లో జరగనున్నాయని పేర్కొంది. ఈ పరీక్షల తేదీలను జూన్లో నిర్వహించే సమీక్ష తర్వాత ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.