లక్షకు చేరువలో మరణాలు | Sakshi
Sakshi News home page

లక్షకు చేరువలో మరణాలు

Published Sat, Oct 3 2020 5:22 AM

India becomes third country to cross 1 lakh Covid deaths - Sakshi

న్యూఢిల్లీ/కోల్‌కతా: దేశంలో కరోనా విస్తృతి ఆగడంలేదు.  గత 24 గంటల్లో 1,095 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 99,773కు చేరుకుంది. గత 24 గంటల్లో 81,484 కొత్త కేసులు వచ్చాయి. గత 11 రోజుల నుంచి యాక్టివ్‌ కేసుల సంఖ్య కేవలం 10 లక్షల లోపే ఉంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. 78,877  మంది కోలుకున్నారు.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,94,068 కు చేరగా, రికవరీలు 53,52,078కు చేరాయి. వీటితో పాటు రికవరీ రేటు 83.70కు చేరగా, మరణాల రేటు 1.56కు పడిపోయింది. గత 12 రోజుల్లో ఏకంగా 10 లక్షల మంది కోలుకున్నారని కేంద్రఆరోగ్య శాఖ చెప్పింది. దేశంలో ప్రస్తుతం  9,42,217  యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం కేసులతో పోలిస్తే ఇవి 14.74 శాతం మాత్రమే అని తెలిపింది. కేవలం 10 రాష్ట్రాల నుంచే 72 శాతం రికవరీలు నమోదవుతున్నాయని తెలిపింది. మరణిస్తున్నవారిలో  70 శాతం మందికిపైగా దీర్ఘకాలిక వ్యాధులతో  బాధపడుతున్న వారేనని చెప్పింది.

కేరళలో144 సెక్షన్‌..
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేరళ ప్రభుత్వం 144 సెక్షన్‌ విధించింది. అక్టోబర్‌ 3 నుంచి 31 వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్‌ మెహతా స్పష్టం చేశారు.  రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అదుపులోకి తెచ్చేందుకు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు చెప్పారు.  

సీఎం మమతను హత్తుకుంటానన్న నేతకు కరోనా..
 తనకు కరోనా వస్తే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హత్తుకుంటానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనుపమ హజ్రాకు కరోనా నిర్ధారణ అయింది.  ఆరోగ్యం సరిగా ఉండ టంలేదంటూ కరోనా పరీక్ష చేయించుకోగా, పాజిటివ్‌ అని తేలింది. ఆయన ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.   

Advertisement
Advertisement