తొలి గాలిపటాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఉపయోగించారు? | Sakshi
Sakshi News home page

Makar Sankranti: తొలి గాలిపటాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఉపయోగించారు?

Published Sun, Jan 14 2024 7:53 AM

Kite was Invented in China - Sakshi

దేశంలోని వివిధ ప్రాంతాలలో మకర సంక్రాంతిని అక్కడి ఆచార సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. అయితే సంక్రాంతి అనగానే ముందుగా గాలిపటాలు గుర్తుకువస్తాయి. జైపూర్, ముంబై, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లలో సంక్రాతి సందర్భంగా కైట్‌ ఫెస్టివల్స్‌ జరుగుతుంటాయి. 

మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు గాలిపటాలు ఎగరేస్తూ ఎంతగానో ఆనందిస్తారు. అయితే గాలిపటం అనేది భారతదేశంలో ఆవిష్కృతం కాలేదు. గాలిపటాన్ని చైనాలో కనుగొన్నారు. క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో చైనాలో గాలిపటాన్ని ఆవిష్కరించారని చెబుతుంటారు. 

ప్రపంచంలోనే మొట్టమొదటి గాలిపటాన్ని చైనీస్ తత్వవేత్త హువాంగ్ హెంగ్ తయారు చేశారు. చైనాలో గాలిపటాలు దూరాలను కొలవడానికి, గాలిని పరీక్షించడానికి, సైనిక కార్యకలాపాలలో  ఉపయోగించేందుకు కనుగొన్నారు. అయితే గాలిపటం భారతదేశంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో నాటి కాలపు రాజులు, చక్రవర్తులు కూడా గాలిపటాలు ఎగురవేసేవారు. ఇది కాలక్రమేణా ప్రజాదరణ పొందింది. 

ప్రస్తుత రోజుల్లో సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరూ గాలిపటాలు ఎగురవేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా గాలిపటాలు ఎగురవేయడం  అంటే ఎంతో ఇష్టం. ఆయన వీలు చిక్కినప్పుడు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. 

మకర సంక్రాంతి నాడు దేశంలోని జైపూర్, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లలో గాలిపటాల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పతంగులు ఎగురవేసేందుకు, వాటిని చూసేందుకు పలు దేశాల టూరిస్టులు భారత్‌కు వస్తుంటారు. సంక్రాంతి నాడు ఆకాశం గాలిపటాలతో నిండిపోతుంది. 

దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల పతంగుల వ్యాపారం జరుగుతుండగా, జైపూర్, అహ్మదాబాద్, ముంబైలలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. పతంగుల తయారీ వలన లక్షలాది మందికి ఉపాధి కూడా లభిస్తుంది. గాలిపటం ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు గాలిపటం ఎగురవేసేటప్పుడు దాని దారం విద్యుత్ తీగలకు చిక్కుకుపోతుంది. ఇటువంటి సందర్భంలో ఆ దారాన్ని లాగితే షాక్ తగిలే అయ్యే ప్రమాదం ఉంది. చాలా మంది పిల్లలు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రమాదాల బారినపడుతుంటారు. ఇటువంటి సందర్భాల్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ మరింత అవసరం.

Advertisement
Advertisement